పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మాకేంటీ : జీవన్ రెడ్డి

పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మాకేంటీ : జీవన్ రెడ్డి

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. మొదట్నుంచీ బీఆర్ఎస్ పార్టీ మహిళల పట్ల వివక్ష చూపిస్తోందని అన్నారు. తెలంగాణ ఫస్ట్ కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించలేదన్నారు. రిజర్వేషన్ ప్రాతిపదికన మహిళలకు అవకాశం వచ్చినా.. స్థానిక ఎమ్మెల్యేల పెద్దరికం పెరిగిపోయిందని విమర్శించారు. నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టవద్దనే నిబంధన ఉన్నా... మూడేళ్లకే ఎందుకు అవిశ్వాస ప్రతిపాదన తెచ్చారని ప్రశ్నించారు. అమాయకపు మహిళల మీద ఒత్తిళ్లెందుకన్న ఆయన ఆడబిడ్డలు కంటతడి పెట్టడం ప్రభుత్వానికి శాపంగా మారుతుందన్నారు.

 పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మాకేంటీ 

పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటనపై జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే తమకేంటన్నారు. పవన్ సిద్ధాంతం ఏంటో, ఆయన ఆలోచన విధానమేంటో ఇప్పటికీ అర్ధంకావడం లేదన్నారు. ఆయన భావస్వరూప్యం గురించి తమకు తెలియదన్నారు. బీఆర్ఎస్ ను వాళ్లకు వాళ్లే జాతీయ పార్టీగా ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ అని విమర్శించారు. 

యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ను విస్మరించిన్రు

రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉందన్న భావనతో 4 వేల మెగావాట్ల ప్రాజెక్టును ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తామని కేంద్రం రాష్ట్రవిభజన చట్టంలో పొందుపరిచిందని జీవన్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పటి వరకు కేవలం 1600 మెగావాట్ల ప్రాజెక్టు మాత్రమే చేపట్టిందన్నారు. మిగతా 2400 మెగావాట్ల ప్రాజెక్టులు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టే అవకాశం ఉందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిని సద్వినియోగం చేసుకోకుండా యాదాద్రిలో ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తోందని విమర్శించారు. 40 వేల కోట్లతో అక్కడ విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తున్నారని.. ఈ లోటును పూడ్చుకునేందుకు ఏసీడీ ఛార్జీలంటూ ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. అవసరం లేని యాదాద్రి పవర్ ప్లాంట్ చేపట్టి.. ఉచితంగా కేంద్రం నిర్మించి ఇచ్చే ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ను విస్మరించారని విమర్శించారు.