కాంగ్రెస్ మేనిఫెస్టోలో… మనసుకూ చోటు

కాంగ్రెస్ మేనిఫెస్టోలో… మనసుకూ చోటు

ఎన్నికల మేనిఫెస్టోల్లో ఎక్కువగా రైతులు, కార్మికులు, ఆడవాళ్లు, నిరుద్యోగులు తదితరుల గురించే ప్రస్తావిస్తుంటారు. కానీ.. ఈసారి ఒక కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లూ ఏ పార్టీ గుర్తించని ఆ విషయాన్ని తొలిసారిగా కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. అదే..మెంటల్ హెల్త్​. దీనికి ఆన్ లైన్ క్యాంపెయిన్ కూడా తోడయ్యింది. ఈ సమస్యపై మరింత విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

‘ప్రజల మానసిక ఆరోగ్యానికి మాదీ హామీ’అని కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది. ‘నేషనల్ మెంటల్ హెల్త్​ పాలసీ–2014’, ‘మెంటల్ హెల్త్​ కేర్ యాక్ట్​–2017’లను అక్షరాలా అమలు చేస్తామని చెప్పింది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో మెంటల్ హెల్త్​కేర్ నిపుణులను నియమించి, వారి సేవలను మానసిక రోగులందరికీ అందుబాటులోకి తెస్తామని తెలిపింది. 2019 లోక్ సభ ఎలక్షన్ సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో ఈ మేరకు ప్రస్తావించింది.హస్తం పార్టీతోపాటు సీపీఎం కూడా ఇలాంటిహామీయే ఇచ్చింది. దీనికి తోడు ఈమధ్య ప్రారంభమైన ఆన్ లైన్ క్యాంపెయిన్ తో మెంటల్ హెల్త్​ అంశం ఇటీవల తెరపైకి వచ్చింది.

‘మానసికఆరోగ్యం’పై మరింత విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ ‘ది మరివాలా హెల్త్​ ఇనీషియేటివ్ (ఎంహెచ్ ఐ)’ # బ్రిడ్జ్ ది కేర్ గ్యాప్ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. మెంటల్ హెల్త్​ కేర్ యాక్ట్​, నేషనల్ మెంటల్ హెల్త్​ ప్లాన్ల అమలును పొలిటికల్ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేర్చేలా చేయటమే ఈ క్యాంపెయిన్ లక్ష్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్ యూహెచ్ ఓ) రిపోర్టు​ల ప్రకారం మన దేశంలో మానసిక వైద్య నిపుణుల సంఖ్య ‘ప్రతి లక్ష మంది జనాభాకు ఒక్కరు’ చొప్పున కూడా లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో సైకియాట్రిస్టులు(0.3), నర్సులు (0.12), సైకాలజిస్టులు (0.07),సోషల్ వర్కర్లు (0.07) అందర్నీ కలిపినా కూడా ఈ ‘లక్షకు ఒకరు’ అనే రేషియోని చేరుకోలేకపోతున్నాం.

ఈ నేపథ్యంలో మానసిక సమస్యలతో బాధపడేవాళ్లను పట్టించుకునే నాథుడే కనిపించట్లేదు. మన దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఏదో ఒక మెంటల్ ప్రాబ్లమ్ ఎదుర్కొంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారని 2015–16లో జరిపిన ‘నేషనల్ మెంటల్ హెల్త్​ సర్వే ’ (ఎన్ ఎంహెచ్ ఎస్ )లో వెల్లడైంది. ఇలాంటి బాధితులను ఆదుకుంటున్న ఆర్గనైజేషన్లకు, కలెక్టివ్ లకు ఎంహెచ్ ఐ.. ఆర్థికచేయూత (గ్రాంట్ల)ను, వ్యూహాత్మక మద్దతు (స్ట్రాటజిక్ సపోర్ట్​)ను అందిస్తోంది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించే ఈ సంస్థ పేద వర్గాల్లోని మానసిక రోగుల బాగోగుల దిశగా సేవా దృక్పథంతో కృషి చేస్తోంది.

 అర్బన్ కన్నా రూరల్ లోనే..

మెంటల్ హెల్త్​ గురించి పల్లెల్లో పెద్దగా పట్టించుకోరని, దానిపై ఎవరూ అంతగా మాట్లాడుకోరని అనుకోవటం పొరపాటు. ఊళ్లల్లో ప్రజలు కలిసిమెలిసి తిరుగుతారు. కాబట్టి ఏ విషయాన్నైనా ఓపెన్ గానే చర్చించుకుంటారు. ఎవరికి ఏ జబ్బున్నా పది మందికీ తెలుస్తుంది. పట్టణాల్లో అలా కాదు.అక్కడ జనం రిజర్వ్​డ్ గా ఉండటం వల్ల పక్కింటోడి ప్రాణం పోయే దాక కూడా బయటకు పొక్కదు.ఈ విషయాన్ని సాక్షాత్తూ ఎంహెచ్ ఐ డైరెక్టర్ రజ్వి మరివాలాయే చెప్పారు.

 ‘ఎల్ జీబీటీక్యూ’ల బాధ వర్ణనాతీతం..

లెస్బియన్ , గే, బైసెక్సువల్ , ట్రాన్స్ జెండర్ , క్వీర్(ఎల్ జీబీటీక్యూ) సమాజానికి మెంటల్ హెల్త్,అవేర్ నెస్ మరింత దూరమవుతోంది. వాళ్ల సెక్సువాలిటీని రెగ్యులర్ కమ్యూనిటీ ఒప్పుకోకపోవటం సమస్య పరిష్కారానికి ఆటంకంగా మారుతోంది.‘ మీరు.. ఆడా, మగా’ అని గుచ్చి గుచ్చి అడిగి ఎగతాళి చేస్తుండటం వాళ్లను తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తోంది. ఈ అవహేళనలు,వేధింపులు, వివక్షలకు ఆ సమాజం కోలుకోలేని రీతిలో బాధితులుగా మారుతోంది. చివరికి అదే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కి దారితీస్తోంది.

ఎల్ జీబీటీక్యూలకు మానసిక ఆరోగ్యం కలిగించటానికి కూడా ఎంహెచ్ ఐ కదిలింది. కౌన్సెలింగ్ ద్వారా ఆ మూడో సమాజాన్ని ఈ మూడ్ నుంచి బయటపడేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో మరింత ఎక్కువ మంది పాల్గొనేలా ముంబై, బెంగళూరు, ఢిల్లీల్లో ‘క్వీర్ అఫిర్ మ్యాటివ్ కౌన్సెలింగ్ ప్రాక్టీస్ ’ పేరిట ఆరు రోజుల సర్టిఫికెట్ కోర్సు అందిస్తోంది. తద్వారా మెంటల్ హెల్త్​ ప్రొ-ఫెషనల్స్ పాటించే సంప్రదాయ వైద్య విధానాల్లో సరికొత్త మార్పులు (రీఓరియెంటేషన్) చేస్తోంది.

మానసిక కుంగుబాటును మాన్పే చికిత్సా పద్ధతులు (యాంటీ ఒప్రెసివ్ థెరాప్యుటిక్ ప్రాక్టీసెస్ ), అసమానతలు, మానసిక ఆరోగ్యం పైవాటి ప్రభావం గురించి ఈ శిక్షణలో వివరిస్తోంది. ఎల్ జీబీటీక్యూల మనసులోని బాధలను తొలిగించి వాళ్లను ఆరోగ్యవంతులుగా మార్చేందుకు దోహదపడే టూల్స్ ని, టెక్నిక్స్ ని అందిస్తోంది. మానసికరోగులను మామూలు మనుషులను చేసే ఈ ట్రైనింగ్ మోడల్ ని దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో, విద్యా సంస్థల్లో , సివిల్ సొసైటీల్లో , వర్క్​ప్లేసుల్లో విస్తృతంగా వినియోగంలోకి తేవాలి.

– ‘ది వైర్ ’ సౌజన్యంతో