
అక్టోబర్ 13న ప్రపంచం అబ్బా అని గట్టిగా గాలి పీల్చుకుంది. రెండు సంవత్సరాలుగా గాజాపై కురిసిన బాంబుల వర్షం ఆగిపోయింది. దీంతో గాలి పీల్చే ఆక్సిజన్ అందక సతమతమయ్యే మానవాళికి అందినట్టనిపించింది.
ఇజ్రాయెల్ బాంబుల దాడిలో చనిపోయినవాళ్ల కథలు, కూలిపోయిన ఇండ్ల శిథిలాలు రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక పుట్టిన నాలాంటి ముసలివాళ్లను కూడా ఇక ఒక న్యూక్లియర్ వార్ వస్తే ఎలా నాశనమౌతుందో అనే మానసిక వ్యధకు గురిచేసింది. అయితే, అక్టోబర్ 7, 2023 నుంచి హమాస్ టెర్రరిస్టులు రెండు సంవత్సరాలు బందీలుగా ఉంచుకుని వదిలేసిన ఇజ్రాయెలీలు చెప్పిన హింసాకాండ, ఆడవారిని హింసించి, రేప్చేసి మానవ శవాలుగా మార్చిన కథలు అంతే తీవ్రంగా కదిలించాయి.
టెర్రరిస్టులు మానవ విలువలు, మత విలువలు, స్త్రీ, పురుష, పిల్లా, పెద్ద అనే విచక్షణ లేకుండా తాము మరో దేశం ప్రజలు అనుకునేవారిని ఎలా హింసిస్తారో, ఎంత నరకయాతన అనుభవింపజేస్తారో హమాస్ అమానుష హత్యాకాండ తెలియజెప్పింది.
యుద్ధ విధ్వంసం గాజాలో జరిగింది మాత్రమే కాదు, ఉక్రెయిన్లో జరిగింది కూడా అదే ఘోరకలి అని కళ్లముందు పెడుతోంది. అయితే, ట్రంప్ విచిత్రమైన సంధికి దారివేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. విచిత్రమేమిటంటే ఏండ్ల తరబడి నలుగుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్య ప్రపంచానికి ఒక పెద్ద సమస్యగా మారింది.
అసలు ఇజ్రాయెల్ నిజమైన దేశమా, పాలస్తీనా నిజమైన దేశమా అనే అంశంపై ప్రపంచ అభిప్రాయం ఇప్పటికి విడిపోయి ఉంది. ఆ ప్రాంతంలోనే ఆది పుస్తక ఆధార మతాలు పుట్టాయి. ముందు ధోరా రూపంలో ఏకదైవ ఆరాధన మతం పుట్టింది అక్కడే. ఆ తర్వాత జీసెస్ క్రీస్తు పుట్టుక, శిలువకేత, పునర్జీవనం న్యూ టెస్ట్మెంట్ రచన తరువాత క్రిస్టియానిటీ పుట్టింది అక్కడే. ఈ మొత్తం హింసా శాంతి సిద్ధాంతాల మధ్య సాగిన నిరంతర చర్చ, హింసా, అహింసా సిద్ధాంత రూపకల్పన మొట్టమొదలు ఆ గడ్డమీదనే పుట్టి పెరిగాయి. ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి.
జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లామ్ ఏర్పడిన తీరు
ఆ తరువాత ఇస్లామ్ మతం పుట్టడానికి పునాదులు కూడా ఆ భూమిలోనే పడ్డాయి. ఐజాక్, ఇస్సేల్ అనే ఇద్దరు అన్నదమ్ముల విభజన జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లామ్ మతాలుగా రూపుదిద్దుకున్నాయి. ముందు జుడాయిజం, క్రిస్టియానిటీ మధ్య తీవ్రమైన సంఘర్షణలు జరిగాయి. అందులో భాగంగానే ఇజ్రాయెల్లో పుట్టిన జీసెస్ మతం ఇజ్రాయెల్ బయట పాకింది. కానీ, ఆ దేశం జుయిష్ మతంగానే బతికింది. దాని గ్రంథ ఆధారిత న్యూ టెస్ట్మెంటుకు ముందు ఉన్న ఓల్డ్ టెస్ట్మెంట్(ధోరా) చదువుకునే మత జీవనం కొనసాగించారు.
అది ఆధునిక కాలంలోనే రోమ్ కేంద్రంగా ప్రపంచంపై ఆధిపత్యం సాధించిన కాథలిక్ పాపల్డమ్ (పోపు రాజ్యం) జుడాయిజంతో సంది నెలకొల్పి ఆ రెండు మతాలు విలువలను జుడో–క్రిస్టియన్ ఎల్ ఐజాక్ సంతతివారిగా, ముఖ్యంగా అబ్రహం వంశపారంపరికులుగా ఐక్యతా మూలాలు వెతుకుతున్నారు.
ఇజ్రాయెల్ నుంచి జ్యూస్ను వెళ్లగొట్టారు . ప్రొఫెట్మహమ్మద్ ఇస్లామ్ను స్థాపించి ఖురాన్తమ గ్రంథంగా ప్రకటించుకున్నాక కూడా తమ మతం ఓల్డ్ టెస్టుమెంటులో చెప్పిన ఇస్మాయిల్ మతమేనని, తాము ఇబ్రహీం (అంటే క్రిస్టియన్ అబ్రహమ్) వారసులమేనని స్పష్టంగానే చెప్పుకున్నారు.
కానీ, ఇస్లాంను విస్తృతపర్చి ఇస్లామిక్ రాజ్యాల ఏర్పాటులో భాగంగా ఇజ్రాయెల్ను ఆక్రమించుకుని జెరూసలెంలో జ్యుస్ పవిత్ర గుడిని కూలగొట్టి దానికి ఎదురుగానే పెద్ద మసీదును నిర్మించుకున్నారు. క్రమంగా ఇజ్రాయెల్ను పాలస్తీనాగ, అక్కడి జ్యుఏతర ప్రజలను అరబ్బు ముస్లింలుగా మార్చుకున్నారు. బట్టమన్ ఎంపయిర్ ఆ ప్రాంతమంతా స్థాపించాక జ్యుస్ను ఇజ్రాయెల్ నుంచి వెళ్లగొట్టారు.
వందల ఏండ్ల తర్వాత మళ్లీ ఏర్పడిన ఇజ్రాయెల్ వందల ఏండ్ల తరువాత 1948లో ఏర్పడ్డ ఇజ్రాయెల్ రాజ్యం బలపడి క్రిస్టియన్ ప్రపంచంతో తన సంబంధాలు మెరుగయ్యాక పాలస్తీనియన్లు అక్కడ ఉండలేని పరిస్థితి కల్పించాలని ఇజ్రాయెలీల ఆలోచన. అయితే, పాలస్తీనియన్లు ఆ దేశస్తులే అనే అంతర్జాతీయ ఒత్తిడి మిడిల్ ఈస్ట్ దేశాన్నీ ముస్లిం దేశాలు కావడం వల్ల పాలస్తీనాకు మొత్తం మిడిల్ ఈస్ట్ దేశాల సపోర్టు దొరికింది.
1967లో ఇజ్రాయెల్ చాలా దేశాలతో యుద్ధం చేసింది. గెలిచింది కూడా. అప్పటి నుంచి పాలస్తీనాలో హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ సంస్థ ఏర్పడి నిరంతరంగా ఇజ్రాయెల్పై హింసాకాండకు పాల్పడుతూ వచ్చింది. దాని పరాకాష్ట అక్టోబర్ 7, 2023నాటి ఇజ్రాయెలీల ఊచకోత. దానితో ఇజ్రాయెల్ హమాస్పై ఈ విధంగా జునోసైడ్కు దారితీసే యుద్ధం చేసి వందలాది మందిని చంపేసింది.
ట్రంప్ విచిత్ర ఎత్తుగడ
ఈ క్రమంలో క్రిస్టియన్ రైట్వింగ్ నాయకుడిగా ట్రంప్ ఎదిగి 2016లో అమెరికా ప్రెసెడెంట్ అయ్యాడు. ఆయన పెద్ద కూతురు ఇవాంక భర్త ఒక జ్యూ. ట్రంప్ తన మొదటి టర్మ్లో ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంకు మార్పించాడు.
ఆ పట్టణం ఇప్పటికీ సగభాగం ఇజ్రాయెలకు, సగభాగం పాలస్తీనియన్లకు ఉంది. ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కుని ఇజ్రాయెల్–పాలస్తీనాలను రెండు దేశాలుగా జీవిస్తూ అవి పరస్పరం గుర్తించుకోవాలని ఒక అంగీకారానికి వచ్చి మొత్తం అరబ్ దేశాలను (ఒక్క ఇరాన్ తప్ప) అన్నింటిని ఒక తాటికి తెచ్చే ప్రయత్నం చేశాడు ట్రంప్. ఈక్రమంలోనే ముస్లింలు ఇబ్రహఅకారుగా భావించే ఒప్పందాన్ని చేయించాడు. దాన్నే ఇజ్రాయెలీలు ఇబ్రహీం అకార్డ్ అంటారు.
ఈ అకార్డ్పేరు జుడాయిజం. ఇస్లాం మతస్తులు తమ ఫాదర్గా చెప్పుకునే ఇబ్రహీం అగ్రహం పేరుతో రాయించారు. ట్రంప్ 2025 జనవరిలో అధికారం చేపట్టకముందు పూర్తిగా ఇజ్రాయెల్ పక్షాన నిలబడి హమాస్ను అంతం చేయాలనే ఇజ్రాయెల్ పాలసీకి అన్ని రకాల సహాయం అందించాడు.
ఇరాన్ను బలహీనపర్చేందుకు దాని నూక్లియర్ కేపబిలిటీని ఒక మధ్యరాత్రి తీవ్రంగా దెబ్బ తీశాడు. ఈక్రమంలో మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలతో రాయబారాలు జరిపి వాటన్నిటినీ చైనా గుప్పిట నుంచి బయటకు రప్పించి అమెరికా మిత్రులను చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈ దశలో భారత్, పాకిస్తాన్ మూడురోజుల యుద్ధం జరిగింది.
ట్రంప్ రాయబార రాజకీయం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధాన్ని ట్రంప్ తనే ఆపినట్లు ప్రకటన చేసి ప్రపంచంలో యుద్ధాలు ఆపే శాంతిదూత ప్రకటనలు మొదలుపెట్టారు. ఈక్రమంలో పాకిస్తాన్ని చైనాకు దూరం చేసి తన ఒడిలోకి తీసుకున్నాడు. పాకిస్తాన్ ట్రంప్ మాత్రమే యుద్ధం ఆపాడని ఆయనకు నోబెల్ ప్రైజ్ రావాలని తీవ్ర ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో మొత్తం ముస్లిం దేశాలను తన క్యాంపులోకి తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఇండియాను ఒంటరి చేసే ప్లాను వేశాడు.
13 అక్టోబర్ 2025 ఒప్పందం
ఇజ్రాయెల్, గాజా యుద్ధ విరమణ భారతదేశాన్ని పూర్తిగా ఒంటరిని చేసింది. ఆ ఒప్పందంలో ఎంతోమంది మిడిల్ ఈస్ట్ దేశాల నాయకులు, యూరప్ దేశాల నాయకులు పాల్గొన్నారు. పాకిస్తాన్కు అందులో పెద్ద పాత్ర కలిపించాడు ట్రంప్. ఈ మొత్తం పరిణామం క్రైస్తవ దేశాలకు, ముస్లిం దేశాలకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని తగ్గించి ఆ రెండు కూటముల మధ్యనే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనే స్థితిని మార్చినట్టు కనపడుతుంది.
35 సంవ్సతరాల కాలంలో హంటింగ్ టన్ అనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్టు ఊహించిన ‘ క్లాష్ ఆఫ్ సివిలైజేషన్’ క్రిస్టియన్ దేశాల కూటమికి, ముస్లిం దేశాల కూటమికి జరుగుతుందనే స్థితి మారింది. భారతదేశం ఒక ముఖ్యమైన క్లిష్టస్థితిలోకి నెట్టబడింది. ముందు ముందు ముస్లిం దేశాలన్నీ పాకిస్తాన్కు అండగా ఉండాలనే ఎత్తుగడ ట్రంప్ వేసినట్టు కనపడుతుంది. అయితే, ముస్లిం దేశాలన్నింటినీ చైనా మార్కెట్ చేతిలో నుంచి తప్పించి అమెరికా మార్కెట్లకు అనుకూలంగా మార్చుకున్నారు ట్రంప్.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్-