
- స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ వాయిదా.. ఈ నెల 6న నిర్వహించాలని నిర్ణయం
- ఆ లోపు చేరికలపై క్లారిటీ వస్తుందని భావిస్తున్న నేతలు
- ఫ్లాష్ సర్వే రిపోర్ట్ నాలుగు రోజుల్లో వస్తుందంటున్న పార్టీ వర్గాలు
- అభ్యర్థుల ప్రకటనపై వేచిచూసే ధోరణిలో పార్టీ హైకమాండ్!
హైదరాబాద్, వెలుగు : స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసింది. ఈ నెల 6వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ ప్రస్తుతం చేరికలపైనే ఫోకస్ పెట్టిందని తెలుస్తున్నది. బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్త నేతలు తమకు అవసరమవుతారనుకుంటే కాంగ్రెస్లోకి తీసుకురావాలని ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చాయని నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే చేరికలపై పార్టీ రాష్ట్ర నేతలు సీరియస్గా దృష్టి పెట్టినట్టు సమాచారం.
మరోవైపు అభ్యర్థుల ఎంపికపై ఫ్లాష్ సర్వే.. రెండు రోజుల క్రితమే మొదలైందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ నివేదిక వచ్చేంత వరకు సమావేశాన్ని వాయిదా వేశారని అంటున్నాయి. గత నెల 20, 21, 22వ తేదీల్లో వరుస సమావేశాలు నిర్వహించిన కమిటీ.. మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించింది. అయితే తేదీలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అక్టోబర్ 2న ఉంటుందని తొలుత పార్టీ వర్గాలు చెప్పినా.. అక్టోబర్ 1నే ఉంటుందంటూ కమిటీ మెంబర్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. కానీ ఈ భేటీని మరింత వెనక్కి జరిపారు.
నేతలతో మంతనాలు
బీఆర్ఎస్, బీజేపీల్లోని పలువురు నేతలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వారందరికీ టికెట్లు దాదాపు కన్ఫర్మ్ అయిపోయాయని చర్చ జరుగుతున్నది. ఇదే క్రమంలో అధికార బీఆర్ఎస్, బీజేపీల్లోని మరింత మంది అసంతృప్తులపై పార్టీ హైకమాండ్ ఫోకస్ పెంచింది. పార్టీకి మైలేజ్ ఇస్తారనుకున్న నేతలను తీసుకొచ్చేలా కసరత్తులు ప్రారంభించాల్సిందిగా పార్టీ రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దలు సూచనలిచ్చినట్టు తెలిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆ పార్టీకి త్వరలోనే గుడ్బై చెప్పనున్నారు. ఇటీవల కేటీఆర్తో ఆయన చర్చలు జరిపినా.. అవి ఫలించలేదు.
కల్వకుర్తి టికెట్ ఆశిస్తున్న కసిరెడ్డి.. కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తున్నది. కాంగ్రెస్లోకి వచ్చేందుకు మోత్కుపల్లి నర్సింహులు గ్రౌండ్ సెట్ చేసుకున్నారని తెలుస్తున్నది. బీజేపీ అసంతృప్త నేతలనూ కాంగ్రెస్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో ఇటీవల దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆయనతో పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే మరికొన్నాళ్లు అభ్యర్థుల ప్రకటనపై వేచి చూడాలన్న ధోరణిలోనే పార్టీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తున్నది.
పాపులారిటీ సర్వే కూడా!
గత నెల ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో సునీల్ కనుగోలు ఓ సర్వే రిపోర్టును ఏఐసీసీ పెద్దలకు అందజేశారు. దానిపై కొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేయడంతో మళ్లీ ఫ్లాష్ సర్వే చేసి, అభ్యంతరాలు వ్యక్తమైన 35 చోట్ల ఫ్లాష్ సర్వే ప్రారంభించాలని హైకమాండ్ ఆదేశించినా.. లేట్ అయినట్లు తెలుస్తున్నది. రెండు రోజుల క్రితమే ఆ సర్వేని ప్రారంభించారని, అది పూర్తయ్యే సరికి మరో నాలుగు రోజులవుతుందని, అందుకే స్క్రీనింగ్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
పాపులారిటీ సర్వే పేరిట మరో కొత్త సర్వే చేపట్టినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఓవరాల్గా పార్టీ పతార, నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటముల పరిస్థితిపై సర్వే చేసిన టీమ్లకు.. పార్టీలో చేర్చుకోవాలనుకునే లీడర్ల మీద కూడా పాపులారిటీ పేరిట సర్వే చేయించారని తెలుస్తున్నది. ఆ సర్వేల ఆధారంగానే ఇటీవల తుమ్మల నాగేశ్వర్రావు, మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్, వేముల వీరేశంలను పార్టీలోకి తీసుకున్నారన్న టాక్ నడుస్తున్నది. వారితో పాటు నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపైనా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సర్వే చేయించారని సమాచారం.
ఆ సెగ్మెంట్లో నల్గొండ జిల్లాలోని కీలక నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉండటంతో.. ఆ లీడర్పై అభిప్రాయం ఎలా ఉందో సర్వే చేయించారని, ఫలితం బాగుంది కాబట్టే ఆ లీడర్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. త్వరలో జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో క్లారిటీ వచ్చాక సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించేందుకు అధిష్ఠానం యోచిస్తున్నది.