బీజేపీ, ఆర్ఎస్ఎస్ విషం లాంటివి: ఖర్గే

బీజేపీ, ఆర్ఎస్ఎస్ విషం లాంటివి: ఖర్గే

ఆర్ఎస్ఎస్, బీజేపీ విషంలాంటివని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రతిపక్ష పార్టీలను, నేతలను బెదిరించేందుకు ప్రధాని మోదీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ‘‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ విషంలాంటివి. వాటిని రుచి చూడరాదు. వాళ్లు దేశాన్ని నాశనం చేశారు” అని ఖర్గే ఫైర్​ అయ్యారు. ‘‘ప్రస్తుత లోక్ సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు లేవు.

ప్రధాని మోదీ మైదానాన్ని తవ్వేసి.. ప్రతిపక్షాలను క్రికెట్ ఆడాలని చెప్తున్నారు. ఇటీవల ఓ మీటింగ్ లో బీజేపీ చీఫ్​ జేపీ నడ్డా కలిసినప్పుడు ఆయనకు ఇదే విషయం చెప్పాను. ఆల్రెడీ కాంగ్రెస్ ఫండ్స్ ను స్తంభింపచేశారని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం లేదని స్పష్టం చేశాను” అని ఖర్గే తెలిపారు. ‘‘ట్యాక్స్ పెనాల్టీ పేరుతో కాంగ్రెస్ కు చెందిన 12 బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. రూ. 14 లక్షల నగదు డిపాజిట్లపై రూ. 135 కోట్ల పెనాల్టీ నోటీసులు ఇచ్చారు. కానీ బీజేపీపై మాత్రం చర్యలు తీసుకోలేదు. బీజేపీ ఖాతాల్లోకి రూ. 42 కోట్లు కూడా ఇలాగే వచ్చాయి. ఈ రూల్స్ ప్రకారం ఆ పార్టీపై రూ. 4,600 కోట్ల పెనాల్టీ వేయాలి. కానీ అలా చేయకపోవడాన్ని దోపిడీ కాక ఇంకేమనాలి?” అని ఆయన ప్రశ్నించారు.