సిద్దిపేట టౌన్, వెలుగు : ప్రతిపక్ష నేతగా, ప్రజల తరఫున నిలబడడంలో కేసీఆర్ విఫలం అయ్యారని, ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తాలో కేసీఆర్ ఫ్లెక్సీ దహనం చేసేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ రషీద్ మాట్లాడుతూ.. వెయ్యి రోజుల్లో రూ. 1.24 కోట్ల ప్రజాధనాన్ని జీతభత్యాల రూపంలో తీసుకున్న కేసీఆర్.. ఎమ్మెల్యేగా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
ప్రజాధనాన్ని తీసుకుంటూ.. అసెంబ్లీకి రాకుండా, ప్రజల సమస్యలపై స్పందించకుండా ఫామ్హౌస్కే పరిమితమైన కేసీఆర్కు ప్రతిపక్ష నేతగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు ఖలీముద్దీన్ అహ్మద్, ముద్దం లక్ష్మి, వాహబ్, శ్రీనివాస్ ముదిరాజ్, మార్క పద్మ, కరుణాకర్ పాల్గొన్నారు.
హుస్నాబాద్లో టెన్షన్.. టెన్షన్
హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు ఎదురుపడడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు కాంగ్రెస్ నాయకులు చౌరస్తాకు చేరుకున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ లీడర్లు సైతం అక్కడికి వచ్చారు.
ఇరుపార్టీల లీడర్లు ఎదురెదురు కావడం, పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి వచ్చి ఇరు పార్టీలకు నచ్చజెప్పారు. జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్ లింగమూర్తి కాంగ్రెస్ కార్యకర్తలను శాంతింపజేసి కార్యక్రమాన్ని వేగంగా ముగించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.
