మెదక్ టౌన్, వెలుగు: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు మానవీయ కోణంలో సేవలందించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పథకాల అమలు, సంక్షేమం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో మెదక్ కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు త్వరగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
మూడు నెలలకోసారి జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మీటింగ్ నిర్వహించాలని సూచించారు. కమిషన్ సభ్యుడు లక్ష్మీనారాయణ, కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు, ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ అంబదాసు రాజేశ్వర్, ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమాధికారులు సింధు, విజయలక్ష్మి, నీలిమ పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో బాలికల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలను చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రారంభించారు.
