- మున్సిపోల్స్లో ఫలించిన సంక్షేమ, అభివృద్ధి మంత్రం
- ఆర్మూర్, భీంగల్, బోధన్ కాంగ్రెస్కైవసం
- కామారెడ్డి మున్సిపాలిటీలో ఏ పార్టీకి రాని మ్యాజిక్ ఫిగర్
- బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుందలో సత్తాచాటిన కాంగ్రెస్
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. అత్యధిక వార్డుల్లో విజయం సాధించి సత్తా చాటుకుంది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అభివృద్ధి మంత్రం ఫలించింది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో 38, ఆర్మూర్ 36 వార్డులు, భీంగల్లో 12 వార్డులు కలిపి 86 వార్డులకుగాను కాంగ్రెస్ 44 వార్డుల్లో సత్తాచాటింది. బీజేపీ 11 వార్డుల్లో గెలుపొందగా, బీఆర్ఎస్14 వార్డులను కైవసం చేసుకుంది. ఎంఐఎం పార్టీ 13 వార్డుల్లో విజయం సాధించగా, ఇండిపెండెంట్లు 4 వార్డులను దక్కించుకున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్శ్రేణులు కీలక పాత్ర పోషించగా, రెండేళ్ల ప్రజా పాలనకు మద్దతు తెలుపుతూ జనం జైకొట్టారు.
బీజేపీ, బీఆర్ఎస్లు సక్సెస్ సాధించకపోవడంతో ఆశలు ఆవిరయ్యాయి. బోధన్లో మజ్లిస్ ప్రభావం చాటుకుంటుంది. కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లోని 92 వార్డులకుగాను కాంగ్రెస్ 50, బీజేపీ 19, బీఆర్ఎస్ 17, ఎంఐఎం 1, ఇండిపెండెంట్లు 5 గెలిచారు. కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్కు అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుందల్లో కాంగ్రెస్ హవా సాగింది. ఇక్కడ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను దక్కించుకునేందుకు ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది.
చక్రం తిప్పిన టీపీసీసీ చీఫ్..
టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ సొంత మండలం భీంగల్లో చక్రం తిప్పారు. రెండు రోజుల ముందు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులను వివరిస్తూ కాంగ్రెస్పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దీంతో ప్రజాపాలనకు జనం జైకొట్టారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి భీంగల్ మున్సిపాలిటీని సవాల్గా తీసుకున్నా సక్సెస్ కాలేకపోయారు. బీఆర్ఎస్ నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఆర్మూర్ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరేయడానికి ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి సర్వశక్తులు ఒడ్డినా 8 చోట్ల మాత్రమే గెలుపు సాధించగలిగారు. 19 స్థానాలు దక్కించుకొని కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ సొంతం చేసుకుంది. రెబెల్స్ పోటీలో లేకుంటే మరో మూడు వార్డులు కాంగ్రెస్కు దక్కేవి. బీఆర్ఎస్ 5 స్థానాలు, మజ్లిస్ ఒక చోట గెలువగా ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన ముగ్గురు రెబెల్స్ విజయం సాధించారు.
బోధన్లో..
38 వార్డులున్న బోధన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 17 వార్డులు కైవసం చేసుకుంది. రెబెల్స్తో కొన్ని వార్డుల్లో పార్టీకి నష్టం వాటిల్లింది. మజ్లిస్ గత వైభవాన్ని చాటుతూ 12 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 3 వార్డులకే పరిమితమైంది. బీఆర్ఎస్ ఐదు వార్డులు గెలువగా కాంగ్రెస్ రెబెల్ ఒకచోట విజయం సాధించారు.
బాన్సువాడ, ఎల్లారెడ్డి,
బిచ్కుంద కాంగ్రెస్కైవసం...
బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. బాన్సువాడలో 19 వార్డులకుగాను 11 , ఎల్లారెడ్డి వార్డులకు 10, బిచ్కుందలో 12 వార్డులకు 10 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో మూడు మున్సిపాలిటీల్లోని చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు హస్తగతం కానున్నాయి.
కామారెడ్డిలో విలక్షణ తీర్పు..
కామారెడ్డి మున్సిసాలిటీల్లో ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకునేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఆయా పార్టీలకు ఇండిపెండెంట్లు, ఎక్స్అఫీషియో సభ్యులు కీలకం కానున్నారు. ఒకే పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే 25 సీట్లు రావాలి. కాంగ్రెస్కు 19 వార్డులతోపాటు ఎక్స్ఆఫిషియో మెంబర్ జహీరాబాద్ ఎంపీ ఉన్నారు. బీజేపీ దక్కించుకోవాలనుకున్న ఇండిపెండెంట్లు 3, ఎక్స్అఫిషియో సభ్యుల సహకారం తీసుకున్నా మ్యాజిక్ ఫిగర్ చేరదు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు, ఇద్దరు ఎమ్మెల్సీల సహకారం తీసుకున్న ఇంకా ముగ్గురు సభ్యులు కావాలి. 3 సీట్లు వచ్చిన ఇండిపెండెంట్లు, 11 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనున్నాయి.
నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల విజేతలు..
మున్సిపాలిటీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఇండిపెండెంట్స్
ఆర్మూర్ 19 08 05 01 03
బోధన్ 17 03 05 12 01
భీంగల్ 08 0 04 0 0
కామారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీల విజేతలు..
మున్సిపాలిటీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఇండిపెండెంట్స్
కామారెడ్డి 19 16 11 0 03
బాన్సువాడ 11 03 03 01 01
ఎల్లారెడ్డి 10 0 01 0 01
బిచ్కుంద 10 0 02 0 0
