ఎస్.ఎం.కృష్ణ కర్నాటక సీఎంగా ఉన్నప్పుడు 2001లో ట్రబుల్ షూటర్ లక్షణాలను ప్రదర్శించడానికి డీకేకు అవకాశం వచ్చింది. ఎస్.ఎం.కృష్ణ కర్నాటక సీఎంగా ఉన్నప్పుడే… మహారాష్ట్ర లో విలాసరావ్ దేశ్ముఖ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడి అధికార కాంగ్రెస్-, ఎన్సీపీ కూటమి కూలిపోయింది. కృష్ణ సాయాన్ని దేశ్ముఖ్ అడిగారు. దేశ్ముఖ్ ను గద్దెనెక్కించే బాధ్యతను డీకేకు అప్పగించారు కృష్ణ. మహారాష్ట్ర ఎమ్మెల్యేలను బెంగళూరుకు తీసుకుకొచ్చి ఈగల్టన్ రిసార్ట్లో వారం రోజులు ఉంచారు శివకుమార్. విశ్వాస పరీక్ష రోజున వాళ్లను తిరిగి ముంబైకి తీసుకెళ్లారు. ట్రస్ట్ ఓటులో దేశ్ ముఖ్ గెలిచారు. దీంతో శివకుమార్ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అభిమానం పొందారు.
సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ ను గత ఏడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓడించడానికి బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. వాటిని చిత్తుచేస్తూ అహ్మద్ పటేల్ గెలుపుకు శివకుమార్ ఎంతగానో సాయపడ్డారు. 40 మంది గుజరాత్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తీసుకొచ్చి తిరిగివాళ్లను ఓటింగ్ సమయానికి తీసుకెళ్లారు.
కుమారస్వామి సర్కార్ను కూలిపోకుండా కాపడడానికి డీకే చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ ప్లాన్ వెనుక శివకుమార్ ‘రిసార్ట్’ రాజకీయాలు మంచి ఫలితాలు ఇచ్చాయి.

