నెగ్గిన అవిశ్వాసం..భువనగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలను దక్కించుకున్న కాంగ్రెస్

నెగ్గిన అవిశ్వాసం..భువనగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలను దక్కించుకున్న కాంగ్రెస్

యాదాద్రి, సూర్యాపేట, నేరేడుచర్ల, హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, వెలుగు :  ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ మరో రెండు మున్సిపాలిటీలను దక్కించుకుంది. ఈ నెల 8న నల్గొండ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న పార్టీ తాజాగా యాదాద్రి జిల్లా భువనగిరి, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంది. కాగా, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఈ మూడు స్థానాలను  సొంత పార్టీలోని అసమ్మతి కౌన్సిలర్ల కారణంగానే పోగొట్టుకుంది.

ఇదిలాఉండగా నల్గొండలో వైస్‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌కు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి బాధ్యతలు అప్పగించిన అధికారులు భువనగిరి, నేరుడు చర్లలో వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్లు లేకపోవడంతో ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు. ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిల నియామకం, చైర్మన్ల ఎన్నిక నిర్వహణపై తుది నిర్ణయం కలెక్టర్లకే ఉందని ప్రిసైడింగ్​ఆఫీసర్లు తెలిపారు. మీటింగ్​కు సంబంధించిన నివేదికను  కలెక్టర్లకు అందిస్తామని చెప్పారు. 

భవనగిరిలో 31 మంది మద్దతు..

యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో చైర్మన్​ ఎనబోయిన ఆంజనేయులు, వైస్​ చైర్మన్ చింతల కిష్టయ్యపై బీఆర్ఎస్​ అసమ్మతి కౌన్సిలర్లు, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు కలిపి 31 మంది అవిశ్వాసం ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం అవిశ్వాసం మీటింగ్​ నిర్వహించగా.. క్యాంప్​లో ఉన్న 16 మంది బీఆర్ఎస్​ కౌన్సిలర్లు బస్సులో నేరుగా మున్సిపాలిటీకి చేరుకున్నారు. అనంతరం 9 మంది కాంగ్రెస్​, ఆరుగురు బీజేపీ వేర్వేరుగా వచ్చారు.  అనంతరం కోరం చెక్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న ప్రిసైడింగ్​ ఆఫీసర్, భువనగిరి ఆర్డీవో అమరేందర్..​

చైర్మన్​, ఆ తర్వాత వైస్​ చైర్మన్​పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను వేర్వేరుగా చదివి విన్పించారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌కు హాజరైన 31 మంది చేతులు లేపి తీర్మానానికి మద్దతు పలకడంతో తీర్మానం నెగ్గినట్టు ప్రకటించారు. అయితే  ఎక్స్​ అఫీషియో మెంబరైన ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, చైర్మన్​, వైస్​ చైర్మన్లు, మరో ఇద్దరు కౌన్సిలర్లు ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు హాజరుకాలేదు. 

నేరేడుచర్లలోనూ.. 

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబుపై కౌన్సిలర్లు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మంగళవారం ప్రిసైడింగ్​ ఆఫీసర్​, హుజూర్ నగర్ ఆర్డీవో మీటింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టగా..  9 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, ముగ్గురు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, ఒక సీపీఎం కౌన్సిలర్ హాజరయ్యారు.  

కోరం ఉండడంతో ప్రిసైడింగ్​ఆఫీసర్​అవిశ్వాస తీర్మానాన్ని చదివి విన్పించారు. 13 మంది కౌన్సిలర్లు బలపరచడంతో జయబాబు చైర్మన్ పదవిని కోల్పోయారు. కాగా ఈ మీటింగ్​కు చైర్మన్ చందమల్ల జయబాబు, ఎక్స్ అఫీషియో మెంబర్స్‌‌ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్ హాజరు కాలేదు. 

 చైర్మన్​గా బచ్చలకూరి ప్రకాశ్?

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్​గా బచ్చలకూరి ప్రకాశ్‌‌‌‌‌‌‌‌ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలిసింది.  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ప్రధాన అనుచరుడైన ప్రకాశ్‌‌‌‌‌‌‌‌ చైర్మన్ పీఠం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఏడుగురు, పార్టీ బలపరిచిన సీపీఎం కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిపించడంలో ఈయన కీలకపాత్ర పోషించారు. కానీ,  బీఆర్ఎస్ ఎక్స్ అఫీషియో మెంబర్ల సపోర్టుతో చైర్మన్ స్థానాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక ముగ్గురు బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు పార్టీలో  చేరడంతో అవిశ్వాసం ఈజీ అయిపోయింది. 

నేడు హుజూర్ నగర్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం

హుజర్ నగర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావుపై బుధవారం అవిశ్వాసం పెడుతున్నారు. మున్సిపాలిటీ లో మొత్తం 28మంది కౌన్సిలర్లు ఉండగా 20 మంది బీఆర్ఎస్ నుంచి ఏడుగురు కాంగ్రెస్, 1 సీపీఎం కౌన్సిలర్లు గెలుపొందారు. వీరిలో 18మంది కౌన్సిలర్లు అవిశ్వాసంపై సంతకాలు చేసి కలెక్టర్ కు అందించారు. అయితే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లకు మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విప్​ జారీ చేశారు.  

కాగా,  వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పదవి ఆశిస్తున్న 3వ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు మద్దతు ఇస్తున్న బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్లర్లు మొత్తం 19 మంది క్యాంప్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు.  విజయవాడలోని ఐలాండ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న వీళ్లు బుధవారం నేరుగా మున్సిపల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు చేరుకోనున్నారు.