చర్చించకపోతే సమావేశాలు ఎందుకు?: కాంగ్రెస్

చర్చించకపోతే సమావేశాలు ఎందుకు?: కాంగ్రెస్

న్యూఢిల్లీ: రాజ్య సభ సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ వరుసగా విమర్శలకు దిగుతోంది. రాజ్య సభ సెషన్‌‌లో కూడా కరోనా పరిస్థితులపై పెద్ద ఎత్తున కేంద్రాన్ని ప్రశ్నించేందుకు కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. అయితే సమావేశాల్లో వైరస్ పరిస్థితులపై చర్చకు కాంగ్రెస్‌‌‌ సభ్యులను ఎంతసేపు మాట్లాడనిస్తారో స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై మాట్లాడేందుకు తమ పార్టీకి కనీసం నాలుగు గంటల పాటు సమయం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

ఇండియన్ ఎకానమీ తగ్గుదలపై ప్రభావం చూపించడంతోపాటు లక్షలాది భారతీయుల జీవనోపాధిని దెబ్బతీసిన కరోనా విషయంపై సుదీర్ఘ చర్చ జరపాలని హస్తం పార్టీ కోరుతోంది. ఈ మేరకు రాజ్య సభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేశ్ లెటర్ రాశారు. ‘కరోనా పరిస్థితులపై పూర్తి స్థాయి చర్చ జరపకుండా, సంబంధిత మంత్రి ఇచ్చే స్టేట్‌‌మెంట్‌‌ను వినడం కోసమైతే సభ నిర్వహించడంలో అర్థం ఏముంది?’ అని సదరు లెటర్‌‌లో జైరామ్ రమేశ్ పేర్కొన్నారని తెలిసింది.