గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ 182 స్థానాలకుగానూ 156 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. అయితే రాష్ట్ర అసెంబ్లీలో ముస్లింల సంఖ్య మాత్రం మూడు నుంచి ఒకటికి పడిపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ముస్లిం అభ్యర్థులను నిలబెట్టలేదు. కాంగ్రెస్ ఆరుగురిని బరిలో దింపగా, ఆమ్ ఆద్మీ పార్టీ నలుగురిని, ఎంఐఎం 14 మందికి టికెట్లు ఇచ్చింది. అయితే వారిలో కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ఖేదావాలా ఒక్కరు మాత్రమే విజయం సాధించారు.
జమాల్పూర్-ఖాడియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన ఇమ్రాన్ ఖేదావాలా బీజేపీ అభ్యర్ధి భూషణ్ అశోక్ భట్ పై 13,658 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇమ్రాన్ ఖేదావాలా 2017లోనూ ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గుజరాత్ జనాభాలో దాదాపు 10 శాతం ముస్లింలు ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాలతో సరిపెట్టుకుని రెండవ స్థానంలో నిలువగా, ఆప్ 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది.
