- 7న ఎస్సై, 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్!
- సెప్టెంబర్ తొలి వారంలో రిజల్ట్
- ఇప్పటి వరకు 4 లక్షల మంది దరఖాస్తు
- ఏజ్ లిమిట్ పెంపుపై ప్రభుత్వానిదే నిర్ణయం
- టీఎస్ఎల్ పీఆర్బీ చైర్మన్ శ్రీనివాస్ రావు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఆధునిక టెక్నాలజీతో పోలీస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నామని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు చెప్పారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించేందుకు.. సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులు ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దని శ్రీనివాస్ రావు సూచించారు. జాబ్స్ ఇప్పిస్తామని ఎవరైనా దళారులు వస్తే వెంటనే చెప్పాలని, అలాంటి వారి సమాచారమిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు.
9.5 లక్షల అప్లికేషన్ల అంచనా...
ఏజ్ లిమిట్ మరో రెండేండ్లు పెంచాలని వస్తున్న డిమాండ్లపై ప్రభుత్వానిదే నిర్ణయమని శ్రీనివాస్ రావు చెప్పారు. సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 4.18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, మొత్తం దాదాపు 7.6 లక్షల దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. 48 శాతం మంది అభ్యర్థులు ఒక్క పోస్టుకు, 29 శాతం మంది రెండు, 17 శాతం మంది మూడు, 4 శాతం మంది నాలుగు, ఒక్క శాతం మంది ఐదు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. 68 శాతం మంది తెలుగు, 32 శాతం మంది ఇంగ్లిష్ ఎంపిక చేసుకున్నారన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి 28 శాతం అప్లికేషన్లు రాగా.. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, నారాయణపేట, సిరిసిల్ల జిల్లాల నుంచి కేవలం ఒక్క శాతమే అప్లికేషన్లు వచ్చాయని వెల్లడించారు. అప్లికేషన్లకు శుక్రవారం రాత్రి 10 గంటల వరకు గడువు ఉందని.. అప్పటి వరకు 5.5 లక్షల మంది అభ్యర్థుల నుంచి 9.5 లక్షల వరకు అప్లికేషన్లు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు.
ప్రాసెస్ పూర్తికి రెండు నెలల టైమ్..
హెల్ప్లైన్ సర్వీస్ కు 11,972 కాల్స్ వచ్చాయని, అందులో 11,449 పరిష్కంచామని శ్రీనివాస్ రావు చెప్పారు. ఈ నెల 21 నుంచి డేటా సెంట్రలైజ్ చేయనున్నట్లు తెలిపారు. అప్లికేషన్ల ఆధారంగా ఎగ్జామ్ సెంటర్లు, ఇన్విజిలేటర్లు, బయోమెట్రిక్ టీమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. క్వశ్చన్ పేపర్లు, ఓఎమ్ఆర్ షీట్స్తో పాటు హాల్ టికెట్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు కనీసం రెండు నెలలు పట్టే అవకాశం ఉందన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎగ్జామ్ సెంటర్లలోనే అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకుంటామని.. ఫేస్, అరచేయి బయోమెట్రిక్, డిజిటల్ సైన్ తీసుకుంటామని తెలిపారు.