- మానేరులో రూ. వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడ్డరు
- అధికార పార్టీ అండతోనే అక్రమాలు
- మానేరు పరిరక్షణ సమితి నాయకుల ఆరోపణ
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా మానేరు వాగులో ఇంకా చెక్ డ్యాంల నిర్మాణమే పూర్తికానప్పటికీ అందులో డీ సిల్టేషన్పేరుతో ఇసుక తవ్వకాలకు పర్మిషన్ ఇచ్చారని, తద్వారా రూలింగ్పార్టీ లీడర్లు, ఆఫీసర్లు కలిసి వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని మానేరు పరిరక్షణ సమితి నాయకులు గొట్టిముక్కుల సురేష్రెడ్డి, అంబటి కరుణాకర్రెడ్డి ఆరోపించారు. ఓదెల మండలం మడక, కనగర్తి ఇసుక రీచ్లను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సురేష్రెడ్డి, కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ మానేరు వాగు మీద చెక్ డ్యాంల నిర్మాణం కోసం నాబార్డు నిధులు మంజూరైనా ఇప్పటివరకు ఒక్కటి కూడా పూర్తి కాలేదన్నారు. కానీ వాగులో 24 చెక్డ్యాంల నిర్మాణం పూర్తయినట్లు ఇరిగేషన్ ఆఫీసర్లు తప్పుడు రిపోర్టులు ఇచ్చారని చెప్పారు. తాము ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరిస్తే ఇప్పటివరకు ఒక్కటి కూడా పూర్తికాలేదనే సమాచారం వచ్చిందన్నారు. చెక్ డ్యాంలు లేకపోయినా అందులో ఇసుక మేటలు వేసినట్లు చూసి, పూడిక తీత పేరుతో ప్రభుత్వం ఏకంగా 19 ఇసుక రీచ్లకు పర్మిషన్లు ఇచ్చిందన్నారు. క్షేత్రస్థాయిలో ఆఫీసర్లు ఇచ్చిన తప్పుడు రిపోర్టులతో కలెక్టర్ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డిస్ట్రిక్ట్ లెవల్సాండ్ కమిటీ పాత్ర నామమాత్రమే అయిందన్నారు. ఇసుక రీచ్లకు అనుమతుల వల్ల ప్రభుత్వానికి రూ. 100 కోట్లు రాగా, కాంట్రాక్టర్లు మాత్రం అంతకు 10 రెట్లు ఇసుక తోడుకుపోతున్నారని సురేష్రెడ్డి, కరుణాకర్రెడ్డి ఆరోపించారు. తద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 1000 కోట్ల దాకా లాస్వచ్చిందన్నారు. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్(టీఎస్ ఎండీసీ) నిబంధనలేవీ పాటించడం లేదని, 2.5 మీటర్ల లోతు వరకే ఇసుక తీయాల్సి ఉండగా 4 మీటర్ల వరకు తోడడంతో వాగంతా కయ్యలు పడిందన్నారు. ఈ దందా వెనుక అధికారపార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుయాయులే ఉన్నారని, అందువల్లే పోలీస్స్టేషన్లలో, తహసీల్దార్ ఆఫీసుల్లో, ఆర్డీఓకు, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకుంటలేరన్నారు. ముందు హడావుడి చేసిన మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. తమ వద్ద ఇసుక రీచ్ల అక్రమ అనుమతులకు సంబంధించి పూర్తి ఆధారాలున్నాయని, దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేయడంతో పాటు, సమీప గ్రామ ప్రజలందరితో కలిసి కోర్టులో పిల్ వేస్తామన్నారు. వారి వెంట ఆయా గ్రామాల రైతులు ఉన్నారు.