రాళ్లవాగుపై హై లెవల్​ బ్రిడ్జి .. రూ.13.50 కోట్ల టీయూఎఫ్​ఐడీసీ ఫండ్స్​ శాంక్షన్​

రాళ్లవాగుపై హై లెవల్​ బ్రిడ్జి .. రూ.13.50 కోట్ల టీయూఎఫ్​ఐడీసీ ఫండ్స్​ శాంక్షన్​
  • ఇటీవల భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు 
  • రంగంపేట, పవర్​హౌస్​కాలనీకి పెరగనున్న కనెక్టివిటీ 
  • హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు 

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ముందగుడు పడింది. బైపాస్​ రోడ్డులోని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ఇప్పుడున్న లో లెవల్​ కాజ్​వే స్థానంలోనే బ్రిడ్జి నిర్మించనున్నారు. టీయూఎఫ్​ఐడీసీ ద్వారా రూ.13.50 కోట్ల ఫండ్స్ కేటాయించారు. 20 ఏండ్ల కిందట లో లెవల్​ కాజ్​వే..  రాళ్లవాగుపై హై లెవల్​ బ్రిడ్జి నిర్మించాలని వాగు ఆవల ఉన్న రంగంపేట, పవర్​హౌస్​కాలనీ, అండాలమ్మ కాలనీవాసులు దశాబ్దాల కాలం నుంచి డిమాండ్​ చేస్తున్నారు. కానీ, గత ప్రభుత్వాలు ప్రజల గోడును ఏనాడూ పట్టించుకోలేదు.

బైపాస్​ రోడ్డు నిర్మాణం తర్వాత వాగు చుట్టుపక్కల కాలనీలు విస్తరించాయి. దీంతో 2005లో రాళ్లవాగుపై సుమారు రూ.80 లక్షలతో లో లెవల్​ కాజ్​వే నిర్మించారు. అప్పటి నుంచి రంగంపేట, పవర్​హౌస్​కాలనీ, అండాలమ్మ కాలనీవాసులు కాజ్​వే మీదుగా మంచిర్యాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అంతకుముందు అండాలమ్మ కాలనీ, ఏసీసీ మీదుగా ఐదారు కిలోమీటర్లు  ప్రయాణించేవారు. కాజ్​వే నిర్మాణంతో కేవలం అర కిలోమీటర్​ దూరంలోనే మంచిర్యాలకు చేరుకుంటున్నారు. ఈ కాలనీల ప్రజలు నిత్యం పాలు, కూరగాయలు అమ్ముకోవడానికి, ఇతర అవసరాలకు టౌన్​కు వస్తుంటారు. విద్యార్థులు, ఉద్యోగులు బైక్​లు, ఆటోలు, ఇతర వహనాల ద్వారా కాజ్​వే మీదుగా సులువుగా రాకపోకలు సాగిస్తున్నారు.

రాళ్లవాగుపై నిర్మించిన కాజ్​వే 2019లో కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. దీంతో కాజ్​వే మీదుగా రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఐదేండ్లుగా వర్షాకాలంలో వరదలకు మట్టి కొట్టుకుపోవడం, అధికారులు తాత్కాలిక రిపేర్లు చేసి చేతులు దులుపుకోవడం తంతుగా మారింది. అంతేకాకుండా రాళ్లవాగుకు వరదలు వచ్చినప్పుడు కాజ్​వే పూర్తిగా నీటి మునిగి రాకపోకలు స్తంభించిపోతున్నాయి. దీంతో మళ్లీ అండాలమ్మ కాలనీవాసులకు రోడ్డే దిక్కవుతోంది. ఇటీవల రంగంపేటలో కొత్త కాలనీలు విస్తరించాయి. రాళ్లవాగుపై హైలెవల్​ బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి.  

ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు ప్రత్యేక చొరవతో రాళ్లవాగుపై హై లెవల్​ బ్రిడ్జి నిర్మాణానికి టీయూఎఫ్​డీసీ ద్వారా రూ.13.50 కోట్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు ఇటీవల అమరవీరుల స్తూపం దగ్గర భూమిపూజ చేశారు. ఈ పనులను పబ్లిక్ హెల్త్​ ఇంజినీరింగ్ ​డిపార్ట్​మెంట్​కు అప్పగించారు. త్వరలోనే టెండర్​ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వార్తతో వాగు అవతలి భూములకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఎట్టకేలకు దశాబ్దాల కల సాకారం కానుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.