అమరావతిలో అన్ని ప్రభుత్వ కార్యాల‌యాలు ఒకేచోట ఉండేలా ట‌వ‌ర్ల నిర్మాణం: మంత్రి నారాయణ

అమరావతిలో అన్ని ప్రభుత్వ కార్యాల‌యాలు ఒకేచోట ఉండేలా ట‌వ‌ర్ల నిర్మాణం: మంత్రి నారాయణ

అమ‌రావ‌తి: రాజధాని అమరావతిలో అన్ని ప్రభుత్వ కార్యాల‌యాలు ఒకేచోట ఉండేలా ట‌వ‌ర్ల నిర్మాణం చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. సోమవారం (జూన్ 2) సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ 48వ స‌మావేశం జరిగింది. సమావేశం అనంతరం భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. అమ‌రావ‌తిలో జీఏడీ ట‌వ‌ర్, మ‌రో నాలుగు ట‌వ‌ర్ల నిర్మాణానికి ఏజెన్సీల‌కు ఎల్‎ఓఏ ఇచ్చేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. 

మొత్తం రూ.3673.44 కోట్లతో అన్ని ప్రభుత్వ కార్యాల‌యాలు ఒకేచోట ఉండేలా ట‌వ‌ర్ల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. అమరావతిలో ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండ‌స్ట్రీల కోసం కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇప్పటి వ‌ర‌కూ 24 వేల ఎక‌రాలు పూలింగ్‎కు ఇచ్చేందుకు రైతుల ఆస‌క్తి చూపించారన్నారు. గ‌తంలో ఉన్న ల్యాండ్ పూలింగ్ నిబంధ‌న‌ల‌ను కొత్త భూముల‌కు వ‌ర్తింప‌చేసేందుకు అధారిటీ ఆమోదముద్ర వేసిందని తెలిపారు. అమ‌రావ‌తిలో స్థాపించే విద్య, వైద్య సంస్థల‌కు రిజిస్ట్రేష‌న్ ఫీజులో స‌డ‌లింపులు ఇస్తామని చెప్పారు. 

మాజీ సీఎం జ‌గ‌న్ గ‌తంలో రాజ‌ధానికి 30 వేల ఎక‌రాలు కావాల‌ని అసెంబ్లీలో ప్రక‌టించి ఇప్పుడు మాట‌మార్చారని విమర్శించారు. నిర్మాణాల ధ‌ర‌లు 22 మంది చీఫ్ ఇంజినీర్ల క‌మిటీ సూచ‌న‌ల మేర‌కే నిర్ణయించామని.. నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడుతూ జగన్ అబ‌ద్దాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మా త‌ప్పేమీ లేక‌పోయినా గ‌త ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టింద‌ని సింగ‌పూర్ అధికారులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. అయినా అమ‌రావ‌తి అభివృద్ది కోసం ఇత‌ర సంస్థల‌తో కూడా సంప్రదింపులు జ‌రుపుతున్నామని తెలిపారు.