
- బైక్ చోరీ కేసులో జరిమానా విధించిన కన్స్యూమర్ ఫోరమ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: పెయిడ్ పార్కింగ్ లో పెట్టిన బైక్ దొంగతనానికి గురైన కేసులో పార్కింగ్ ఏజెన్సీ సహా హెచ్ఎండీఏకు కన్స్యూమర్ ఫోరమ్ రూ.30 వేల జరిమానా విధించింది. కూకట్పల్లికి చెందిన హరిక్రిష్ణ 2022 అక్టోబర్ 10న ఎన్టీఆర్ గార్డెన్కు ఫ్యామిలీతో వెళ్లాడు. రూ.20 చెల్లించి తన బైక్ ను పార్క్ చేశాడు. తిరిగొచ్చేసరికి బండి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రెండు నెలల తర్వాత బైక్ను పోలీసులు బాధితుడికి అప్పగించారు. కానీ, అది నడిచే కండిషన్ లో లేకపోవడంతో రిపేర్ల కోసం రూ.28 వేలు ఖర్చు చేశాడు. దీంతో తన బైక్ దొంగతనానికి కారణమైన పార్కింగ్ ఏజెన్సీని రిపేర్ల ఖర్చులు చెల్లించాలని కోరాడు. ఇందుకు ఏజెన్సీ నిరాకరించడంతో లైసెన్సులు ఇచ్చినా హెచ్ఎండీఏను సంప్రదించాడు.
అయినా ఫలితం లేకపోవడంతో న్యాయం కోసం తెలంగాణ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. ఆధారాలను పరిశీలించిన కమిషన్ శుక్రవారం తీర్పుని చ్చింది. నిర్లక్ష్యం వహించిన ఏజెన్సీ, ఫిర్యాదుకు స్పందించని హెచ్ఎండీఏకు కలిపి రూ.25 వేల నష్టపరిహారం, ఖర్చుల కోసం రూ.5 వేలు చెల్లించాలని ఆదేశిం చింది.