కోర్టు తీర్పును ధిక్కరించి  సంగమేశ్వరం పనులు

కోర్టు తీర్పును ధిక్కరించి  సంగమేశ్వరం పనులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కోర్టు తీర్పును అతిక్రమించి ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌‌‌ స్కీం పనులు చేస్తోందని నారాయణపేట జిల్లా బాపన్‌‌‌‌పల్లికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ను ఆశ్రయించారు. ఆయన తరఫున సుప్రీంకోర్టు అడ్వొకేట్‌‌‌‌ శ్రావణ్‌‌‌‌కుమార్​ఎన్జీటీ చెన్నై బెంచ్‌‌‌‌లో పిటిషన్‌‌‌‌ ఫైల్‌‌‌‌ చేశారు. గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌పై విచారణ జరిపిన ఎన్జీటీ.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరని 2020 అక్టోబర్‌‌‌‌ 29న జడ్జిమెంట్‌‌‌‌ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ తీర్పును ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అతిక్రమించిందని పేర్కొన్నారు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ టైంలో భారీ యంత్రాలతో పెద్ద ఎత్తున పనులు చేస్తూ ఎన్జీటీ ఆదేశాలను తుంగలో తొక్కారని వివరించారు. ఏపీ సర్కారుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌ నుంచి ఏపీ ఏటా 115 టీఎంసీలను తరలిస్తోంది.

బచావత్‌‌‌‌ అవార్డు (కేడబ్ల్యూడీటీ-1)లో నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులకు దీని ద్వారా నీటిని తరలిస్తోంది. కొత్తగా ఎత్తిపోతల పథకం చేపట్టాల్సిన అవసరం లేకున్నా రోజుకు 3 టీఎంసీలు తరలించేలా పనులు చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌ కెపాసిటీని 80 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు కృష్ణా నీళ్లను తరలించేందుకు కాలువల విస్తరణ, అనేక పనులు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం గోదావరిపై పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాలను ఎలాంటి అనుమతులు లేకుండానే ఏడాదిలోగా పూర్తి చేసింది. రాయలసీమ లిఫ్ట్‌‌‌‌ పనులనూ అలాగే చేస్తున్నారు. గతంలో ప్రాజెక్టు కోసం సర్వే మాత్రమే చేస్తున్నామని ఏపీ చీఫ్‌‌‌‌ సెక్రటరీ ఎన్జీటీలో అఫిడవిట్‌‌‌‌ ఫైల్‌‌‌‌ చేశారు. వర్క్‌‌‌‌ సైట్‌‌‌‌లో పెద్ద ఎత్తున పనులు చేస్తూ ఎన్జీటీ తీర్పును ఉల్లంఘించారు...’ అని పిటిషన్ లో వివరించారు.