ఓయూ, వెలుగు: తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మహా ధర్నా చేపట్టారు. శనివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ మెయిన్ రోడ్ పక్కన నిర్వహించిన ఈ ధర్నాలో వందల మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు హాజరయ్యారు. తమకు ఇచ్చిన రెగ్యులరైజేషన్ హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఓయూ టీచర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ జి.మల్లేశ్ హాజరై వారికి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ఓయూలో ఎన్నో ఏండ్లుగా బోధన, పరిశోధన, పరిపాలన విధుల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయూ, తెలంగాణ మహిళా వర్సిటీ, బాసర ఐఐఐటీకి చెందిన నాయకులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
