వివాదాస్పద ఐఏఎస్ పూజా ఖేద్కర్ ట్రైనింగ్ నిలిపివేత

వివాదాస్పద ఐఏఎస్ పూజా ఖేద్కర్ ట్రైనింగ్ నిలిపివేత
  • వాపస్ ​రావాలని ఆర్దర్స్ ఇచ్చిన యూపీఎస్సీ
  • 23 లోగా ముస్సోరిలోని అకాడమీలో రిపోర్టు చేయాలని నోటీస్

పుణె: అధికార దుర్వినియోగం, తప్పుడు పత్రాలు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐఏఎస్​ పూజా ఖేద్కర్​కు భారీ షాక్ తగిలింది. ఆమె ట్రైనింగ్​ను తాత్కాలికంగా హోల్డ్​లో పెడుతున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్​ మంగళవారం ప్రకటించింది. జులై 23 లోపు ఎంత వీలైతే అంత తొందరగా ముస్సోరిలోని లాల్​బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్​లో రిపోర్టు చేయాలని పూజా ఖేద్కర్​కు నోటీసులు పంపింది.

 సివిల్ సర్వీసెస్​లో ఎంపికయ్యేందుకు ఆమె హ్యాండీక్యాప్​డ్, ఓబీసీ సర్టిఫెకెట్లను తారుమారు చేశారనే ఆరోపణలతో పూజా ఖేద్కర్ ట్రైనింగ్​ను టెంపరరీగా నిలిపివేస్తున్నామని నోటీస్​లో పేర్కొంది. తదుపరి చర్యల కోసం ఆమెను జులై 23లోగా ముస్సోరిలోని అకాడమీకి రావాల్సిందిగా కోరినట్లు తెలిపింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర సర్కారుకు తెలియజేశామని చెప్పింది. దీంతో వాషిమ్​లో సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్​గా ఉన్న పూజా ఖేద్కర్​ను ఆ రాష్ట్ర అధికారులు వెంటనే రిలీవ్ చేశారు.

డిజేబిలిటీ సర్టిఫికెట్లు నకిలీవేనా!

యూపీఎస్సీకి సమర్పించిన పూజా ఖేద్కర్​ వైకల్యానికి సంబంధించిన పలు సర్టిఫికెట్లు తాజాగా బయటపడ్డాయి. 2018, 2021లలో అహ్మద్ నగర్​ జిల్లా హాస్పిటల్ నుంచి తీసుకున్న పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ (పీడబ్ల్యూబీడీ)సర్టిఫికెట్లను ఆమె యూపీఎస్సీకి సమర్పించారు. 2022 ఆగస్టులో పుణె జిల్లాలోని పింప్రి ఆస్పత్రి నుంచి లోకోమోటర్ డిజేబిలిటీ సర్టిఫికెట్ పొందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆ సర్టిఫికెట్​లో పూజకు మోకాలిలో 7శాతం వైకల్యం ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే, అదే నెలలో పూజ పుణెలోని మరో ఆస్పత్రి ఔంధ్ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ అంగవైకల్య ధ్రువీకరణకోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, డాక్టర్లు టెస్టులు చేసిన తర్వాత తిరస్కరించారు. ఈ విషయాలన్నీ బయటపడటంతో పూజ మరింత చిక్కుల్లో పడింది.

మొదటి నుంచీ పూజ చుట్టూ అన్నీ వివాదాలే.. 

2023 బ్యాచ్ సివిల్స్ ర్యాంకర్​ అయిన పూజా ఖేద్కర్..మితిమీరిన సౌలత్​లు కోరడం, అధికార దుర్వినియోగంతో ఇటీవలే మహారాష్ట్రలోని పుణె నుంచి వాషిమ్ జిల్లాకు ట్రాన్స్​ఫర్ అయ్యారు. సివిల్స్ లో ఎంపికయ్యేందుకు ఆమె తప్పుడు పత్రాలు వినియోగించారని, ఓబీసీ రిజర్వేషన్​ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలూ ఆమె ఎదుర్కొంటున్నారు. 

దీనిపై విచారణకు కేంద్ర ప్రభుత్వం గతవారం ఏకసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె ట్రైనింగ్​ను టెంపరరీగా నిలిపివేస్తూ యూపీఎస్సీ రీకాల్ ఉత్తర్వులిచ్చింది. కాగా, పూజా ఖేద్కర్ తల్లిదండ్రులు కూడా పరారీలో ఉన్నారు. ఓ క్రిమినల్ కేసుకు సంబంధించి వాళ్లకోసం పుణె పోలీసులు వెతుకుతున్నారు.