కోర్ గ్రూపులు వద్దు కంప్యూటర్ సైన్సే ముద్దు

కోర్ గ్రూపులు వద్దు కంప్యూటర్ సైన్సే ముద్దు
  • ఇంజినీరింగ్ లో ఏటా తగ్గుతున్న సంప్రదాయ కోర్సుల సీట్లు, అడ్మిషన్లు 
  • సివిల్, మెకానికల్ పై స్టూడెంట్ల శీతకన్ను
  • కంప్యూటర్  సైన్స్ పేనే మోజు
  • కోర్సు పూర్తికాగానే కొలువులు రావడంతో అటువైపు 

హైదరాబాద్, వెలుగు : ఇంజినీరింగ్ లో సంప్రదాయ కోర్సులైన కోర్ గ్రూపులు ఏటా కనుమరుగైపోతున్నాయి. రాష్ట్రంలో ఇంజినీరింగ్  కోర్సులకు డిమాండ్  పెరుగుతోంది. ఏటా లక్షకు పైగా విద్యార్థులు ఇంజినీరింగ్  కోర్సుల్లో చేరుతున్నారు. అయితే,  సంప్రదాయ కోర్సులైన (కోర్) సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ తో పాటు వాటి రిలేటెడ్  కోర్సులపై స్టూడెంట్లు ఆసక్తి చూపడం లేదు. కంప్యూటర్  సైన్స్ (సీఎస్) , ఐటీ దాని అనుబంధ కోర్సుల్లోనే ఎక్కువ మంది చేరుతున్నారు. దీంతో ఇప్పటికే చాలా ఇంజినీరింగ్  కాలేజీలు కోర్  కోర్సులను ఎత్తేయగా, మరికొన్ని కాలేజీల్లో కేవలం ఒక్కో సెక్షన్ ను నామమాత్రంగా కొనసాగిస్తున్నారు. గత నాలుగైదు ఏండ్లుగా కంప్యూటర్  సైన్స్, ఐటీ తదితర రిలేటెడ్  ఎమర్జింగ్ కోర్సులైన సీఎస్ఈ, ఐటీ, ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్  సెక్యూరిటీ తదితర కోర్సుల్లో సీట్లు, అడ్మిషన్లు పెరుగుతున్నాయి. 2020–21లో ఆయా కోర్సుల్లో 58,633 సీట్లు ఉండగా, 2023–24 నాటికి ఆ సంఖ్య 80,535 సీట్లకు పెరిగింది. డిమాండ్  కూడా అదే రేంజ్ లో ఉంది.  2020–21లో 42,804 మంది చేరితే, గతేడాది నాటికి 69,577 మంది అడ్మిషన్లు పొందారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి కంప్యూటర్  సైన్స్  కోర్సుల్లో మార్పులు వస్తున్నాయి. దీంతో మార్కెట్లో ఆయా కోర్సులు చదివిన వారికి డిమాండ్  ఉంది. కోర్సు పూర్తికాగానే ఎక్కువ జీతంతో కొలువులు దొరుకుతుండడంతో స్టూడెంట్లు ఆ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.  

  • చితికిపోతున్న సివిల్స్

ఇంజినీరింగ్  కోర్  గ్రూపులైన సివిల్స్, మెకానికల్, ఎలక్ట్రికల్  లాంటి కోర్సుల్లో ఏటా అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. 2020–21లో కాలేజీల్లో 48,776 సీట్లు ఉంటే, 2024–25 నాటికి అవి 30,900 సీట్లకు తగ్గిపోయాయి.  2021–22లో 25,377 సీట్లు భర్తీ అయితే, 2023–24కు 21,424 మంది మాత్రమే చేరారు. అయితే, మారుతున్న కాలానికి అణుగుణంగా కోర్  గ్రూపులను, వాటి సిలబస్ ను మార్చకపోవడంతోనే ఈ సమస్య ఎర్పడిందనే వాదనలు ఉన్నాయి. మరోపక్క ఈ కోర్సులు చదివిన వారికి పెద్దగా ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. దొరికినా తక్కువ జీతంతోనే ఉంటున్నాయి. ఈ కోర్సులన్నీ ఫీల్డ్  వర్కుతో కూడినవి కావడంతో వీటిలో చేరేందుకు అమ్మాయిలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పరిశ్రమలకు తగ్గట్టు ఆయా కోర్సులు చదివిన వారిని తయారు చేయడంలో  ప్రభుత్వాల లోపం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం   మేకిన్  ఇండియా, మేడిన్  ఇండియా లాంటివి తెచ్చినా సంప్రదాయ కోర్సుల అభివృద్ధిపై పెద్దగా దృష్టిసారించలేదనే విమర్శలు ఉన్నాయి.  

  • కోర్  అడ్మిషన్ల పెంపుపై సర్కారు నజర్

రాష్ట్రంలో ఇంజినీరింగ్ అంటే కంప్యూటర్  సైన్స్  అనే  ట్రెండ్​ను మార్చాలనే భావనతో సర్కారు ఉంది. దీంతో కోర్  గ్రూపుల బలోపేతంపై సర్కారు దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగానే కంప్యూటర్  సైన్స్  రిలేటేడ్  సీట్ల పెంపునకు ససేమిరా అన్నది. 2024–25 సంవత్సరంలో కంప్యూటర్  సైన్స్ లో 20 వేలకు పైగా సీట్లు పెంచుకునేందుకు ప్రైవేటు కాలేజీలు అనుమతి తీసుకున్నా.. రాష్ట్ర  ప్రభుత్వం మాత్రం 2,640 సీట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. మరోపక్క 9 వేలకు పైగా సీట్లను కంప్యూటర్   సైన్స్  రిలేటెడ్  కోర్సుల్లోకి కన్వర్షన్ కు మేనేజ్మెంట్లు పెట్టుకోగా.. వాటిని కూడా  ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ప్రధానంగా సివిల్, మెకానికల్  సీట్లను సీఎస్ఈలోకి కన్వర్షన్ కు పెట్టిన సీట్లను పక్కనపెట్టి, మిగిలిన సీట్లకు అనుమతులు ఇచ్చే అంశాన్ని సర్కారు  పరిశీలిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సివిల్, మెకానికల్, ఎలక్ర్టానిక్స్  తదితర కోర్సుల్లో మార్పులు తీసుకొచ్చేందుకు సర్కారు కృషి చేస్తోంది. 

  • పరిశ్రమలతో అనుసంధానిస్తే మంచి ఫలితాలు

ఇంజినీరింగ్  కోర్ బ్రాంచుల్లో అడ్మిషన్లు తగ్గడం ఆందోళనకరం. ఆయా కోర్సుల్లో అడ్మిషన్ల పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టడం మంచి పరిణామం.  ఎంప్లాయ్మెంట్  కోసం కోర్  గ్రూపులను పరిశ్రమలతో అనుసంధానం చేయాలి. స్థానిక పరిశ్రమలకు, స్థానిక అవసరాలకు అనుగుణంగా కోర్  గ్రూపులను ఏర్పాటు చేసుకోవాలి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోని పరిశ్రమలతోనూ ఎంఓయూలు చేసుకుంటే బెటర్. చైనా లాంటి దేశాలు కోర్  బ్రాంచులపైనే దృష్టి పెడ్తాయి. దీంతో అక్కడ అభివృద్ధి వేగంగా పెరిగింది.

- ప్రొఫెసర్ శ్రీరామ్  వెంకటేశ్, టీజీసీహెచ్ఈ సెక్రటరీ