భారీ వర్షాలు.. నిండుతున్న తెలంగాణ ప్రాజెక్టులు

భారీ వర్షాలు.. నిండుతున్న తెలంగాణ ప్రాజెక్టులు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకుంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా వరద రావడంతో  జూరాల ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరుగుతోంది.  ప్రస్తుతం ప్రాజెక్టుకు 90,800 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు 17 గేట్లు ఎత్తి 66,810 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 33,084 క్యూసెక్కులు వదలుతున్నారు. జూరాల ప్రాజెక్టు మొత్తం నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.50 మీటర్లు నీటిమట్టం ఉంది. జలాశయం నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ఇప్పుడు 7.645 టీఎంసీల వరదనీరు ఉంది.

మరోవైపు  శ్రీశైలం ప్రాజెక్టుకు 1,04,416 క్యూసెక్కుల వరద నీరు రాగా అధికారులు 99,894 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. సాగర్‌లో ప్రస్తుతం 504.50 అడుగుల వద్ద నీరు నిల్వ ఉండగా ప్రాజెక్టు నుంచి 9,874 క్యూసెక్కులు దిగువకు వదిలారు. 

ఇంకోవైపు నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 14,063 క్యూసెక్కుల వరద నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1067.10 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టుకు నీటినిల్వ 80.5 టీఎంసీలు కాగా ఇప్పుడు 18.833 టీఎంసీల వరదనీరు ఉంది. ఇక నిర్మల్‌ జిల్లాలోని స్వర్ణ జలాశయానికి 6480 క్యూసెక్కుల వరద రావడంతో ప్రాజెక్టులో ప్రస్తుతం 1176 అడుగుల నీటమట్టం ఉందని అధికారులు తెలిపారు.