ప్రజలను దోచుకోవడమే కల్వకుంట్ల పని: వివేక్ వెంకటస్వామి

ప్రజలను దోచుకోవడమే కల్వకుంట్ల పని:  వివేక్ వెంకటస్వామి

ప్రజలను దోచుకోవడమే కల్వకుంట్ల కుటుంబం పనిగా పెట్టుకుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. రైతులను కోటీశ్వరులను చేస్తా అని చెప్పి.. తన కుటుంబసభ్యులను ధనవంతుల్ని చేసిండని ఆయన ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నాగపూర్ గ్రామంలో ప్రజా గోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‭కు వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. 

చెన్నూరు గోదావరి అక్రమ ఇసుకతో అధికార పార్టీ నాయకులు కోట్లు సంపాదించుకుంటున్నారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణా ఆపి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని.. వివేక్ వెంటకస్వామి వద్ద ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇక తాగునీటి సదుపాయం లేక చెన్నూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. వెంటనే ఇళ్లు లేని వారిని డబుల్ బెడ్  రూం ఇండ్లు కేటాయించి.. నిరుద్యోగ భృతి కింద ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బాల్కసుమన్ అవినీతిలో మునిగిపోయి అక్రమ సంపాదన పెంచుకున్నారని ఆయన విమర్శించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని.. బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేశామని గుర్తు చేశారు. బాధితులకు ఎకరానికి రూ.25 లక్షల చొప్పున పరిహారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.