ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో స్కూళ్లు, కాలేజీ లు, కోచింగ్ సెంటర్లను బంద్ చేస్తున్నట్టు మంత్రి నితిన్ రౌత్ వెల్లడించారు. మార్చి 7 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయన్నారు. శని, ఆది వారాల్లో పెద్ద మార్కెట్లు ఓపెన్ కావని చెప్పారు. మ్యారేజ్ హాల్స్ను ఫిబ్రవరి 25 నుంచి మార్చి 7 వరకు బంద్ పెట్టాలన్నారు.
ముంబైలో గ్యాదరింగ్స్ బంద్
ముంబైలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఆంక్షలు పెంచారు. సోమవారం నుంచి సోషల్, పొలిటికల్, రిలీజియస్ గ్యాదరింగ్స్ను బ్యాన్ చేశారు. జనం కేర్లెస్గా ఉండటంతోనే వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోందని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు. ముంబైలోని జింఖానాలో కరోనా రూల్స్ పాటించకుండా పెండ్లి జరిపిస్తున్న నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఏడుగురు మంత్రులకు కరోనా..
మరోసారి లాక్డౌన్ను భరించలేమని మంత్రి రాజేశ్ తోపే అన్నారు. అది రాష్ట్రానికి చాలా డేంజరని ప్రజలను హెచ్చరించారు. అందరూ తప్పనిసరిగా కరోనా రూల్స్ పాటించాలని కోరారు. మంత్రి తోపేతో పాటు మరో ఆరుగురు మంత్రులు అనిల్ దేశ్ముఖ్, రాజేంద్ర సింగ్నే, జయంత్ పాటిల్, సతేజ్ పాటిల్, బచ్చు కడు, ఛగన్ భుజ్బల్ కరోనా బారిన పడ్డారు.
కేరళతో బార్డర్ క్లోజ్ చేసిన కర్నాటక
కేరళలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్రంతో బార్డర్ను కర్నాటక క్లోజ్ చేసింది. సోమవారం ఉదయం చాలా రోడ్లు, హైవేలను అధికారులు సీజ్ చేయడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామైంది. బార్డర్ క్రాస్ చేయాలంటే 72 గంటల్లోపు చేసిన కరోనా టెస్టు నెగెటివ్ సర్టిఫికెట్ చూపించాలని అధికారులు చెప్పారు.
దేశంలో మరో 14,199 మందికి వైరస్
దేశంలో కొత్తగా మరో 14,199 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈమేరకు సోమవారం పొద్దున 8 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.10 కోట్లు దాటింది. గత 5 రోజులుగా యాక్టివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయని డేటా ద్వారా తెలుస్తోంది. దేశంలో సోమవారం ఒక్క రోజు 83 మంది చనిపోయారు.