నిర్లక్ష్యంగా ఉంటే కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: కేసులు తక్కువగా నమోదవుతున్నాయని.. వైరస్ లేదనే అనుకోవద్దని, నిర్లక్ష్యంగా ఉంటే కరోనా తిరిగి విజృంభించే ప్రమాదముందని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. వైరస్, బ్యాక్టీరియాలకు చలికాలం అనుకూలమైన కాలమని, డెంగీ, మలేరియా, స్వైన్ప్లూ వంటి సీజనల్ వ్యాధులు పెరిగే టైమ్ ఇదేనని అధికారులు చెప్పారు.
కరోనాతోపాటు సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు మంగళవారం ఆరోగ్యశాఖ సెక్రటరీ రిజ్వీ, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు జిల్లాల అధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతేడాదితో పోల్చితే దాదాపు 40-50 శాతం మేరకు డెంగీ, స్వైన్ ఫ్లూ కేసులు తగ్గాయయని చెప్పారు.
అమెరికా, ఐరోపా దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోందని.. ఫస్ట్ వేవ్లో పాటించిన జాగ్రత్తలను ప్రజలు తర్వాత నిర్లక్ష్యం చేశారని చెప్పారు. దీంతో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి సెకండ్ వేవ్ ను అరికట్టడానికి కృషి చేయాలన్నారు.