పట్టాలిచ్చిన పోడు భూముల్లోకి ఫారెస్ట్ అధికారుల జోక్యం చేసుకోవద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో వర్షకాలంలోపే సర్వే పూర్తి చేసి, సాగులో ఉన్న ప్రతి పేద రైతుకు రెవెన్యూ పట్టాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఇసుక, మట్టి విషయంలో సామాన్యులను ఇబ్బంది పెడితే సహించేది లేదని అన్నారు.
గత రెండేళ్లలోనే 75 వేల ఉద్యోగాల భర్తీ.. లక్షా ఇరవై వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. అవినీతికి తావులేకుండా, పైసా ఖర్చు లేకుండా.. హైదరాబాద్లో బటన్ నొక్కితే నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు! రెండో విడతే కాదు.. మూడో విడత, నాలుగో విడత.. ఇళ్లు లేని ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చే బాధ్యత తమదని చెప్పారు.
గత ప్రభుత్వ ధరణి అడ్డంకులను తొలగిస్తూ.. సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పాసుబుక్కుల సమస్యకు భూ భారతి ద్వారా పరిష్కారం చూపుతున్నాం. న్యాయంగా పొజిషన్లో ఉన్న ప్రతి రైతుకు పట్టా ఇచ్చి తీరుతామని చెప్పారు. ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది.. మీ సమస్యలను విని అక్కడికక్కడే పరిష్కారం చూపుతుందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయని పాలన.. పది కాలాల పాటు గుర్తుండిపోయే అభివృద్ధి! ఇది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం.. మన ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పారు.
