- కొత్త కో – ఆపరేటివ్ ఇన్సూరెన్స్ కంపెనీని ఏర్పాటు చేస్తామని మంత్రి అమిత్ షా ప్రకటన
- 500 సిటీలకు భారత్ ట్యాక్సీ సేవలను విస్తరిస్తామని వెల్లడి
న్యూఢిల్లీ: కో–ఆపరేటివ్ సొసైటీలలో సభ్యులుగా ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరికి తక్కువ ప్రీమియంతో లైఫ్ ఇన్సూరెన్స్ అందించనుంది. ఇందుకోసం కో–ఆపరేటివ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీనిని అమూల్, ఇఫ్కో, క్రిబ్కో, పెద్ద కో–ఆపరేటివ్ బ్యాంకులు వంటివి కలిసి ఏర్పాటు చేస్తుండగా, వచ్చిన లాభాలను పాలసీ హోల్డర్లకు బోనస్లుగా లేదా ఈ సంస్థలకు డివిడెండ్లుగా పంచుతారు.
ఈ సంస్థలు కో–ఆపరేటివ్ ఆర్గనైజేషన్లు కాబట్టి చివరికి ఈ లాభాలు సాధారణ సొసైటీ మెంబర్లకు దక్కుతాయి. కో–ఆపరేటివ్ సంఘాల్లో మెంబర్లు కాని వారు కూడా ఈ సంస్థ నుంచి పాలసీ కొనుగోలు చేసుకోవచ్చు. ఇది లాభాల కోసం పనిచేయదు కాబట్టి ప్రీమియం ధరలు తక్కువగా ఉంటాయి. కో–ఆపరేటివ్ మినిస్ట్రీ ఐదో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీలో సోమవారం పలు ఈ కీలక ప్రకటన చేశారు.
ఇప్పటికే ఫెర్టిలైజర్ కో–ఆపరేటివ్ కంపెనీ ఇఫ్కో, ఇన్సూరెన్స్ బిజినెస్లో ఉందని, ఇఫ్కో–-టోక్యో ద్వారా ఈ బిజినెస్ నిర్వహిస్తోందని అన్నారు. ఇప్పుడు నేరుగా కో–ఆపరేటివ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రానుందని చెప్పారు. కాగా, ఈ సంస్థ కంపెనీస్ చట్టం కింద రిజిస్టర్ అయినా, కో–ఆపరేటివ్ రూల్స్ ప్రకారం నడుస్తుంది.
మరోవైపు దేశవ్యాప్తంగా 50 వేల ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ (పీఏసీఎస్)ను ఈ--–పీఏసీఎస్గా డిజిటలైజ్ చేసే ప్రక్రియను అమిత్ షా ప్రారంభించారు. కొత్త నిబంధనల ప్రకారం ఇవి కేవలం రుణాలకే పరిమితం కాకుండా రిటైల్, కోల్డ్ స్టోరేజ్, హెల్త్కేర్, ఫ్యూయల్ ఔట్లెట్లు, జన ఔషధి కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లుగా 25కు పైగా విభిన్న వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ఈ సెంటర్లు, కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా కో–ఆపరేటివ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అమ్ముతారు.
ఇప్పటికే 6.37 లక్షల మంది డ్రైవర్లు..
ట్యాక్సీ సర్వీస్లు అందించే కో–ఆపరేటివ్ సంస్థ భారత్ టాక్సీను దేశం మొత్తం మీద విస్తరించే పనిలో ప్రభుత్వం ఉంది. డ్రైవర్ల సంక్షేమమే ధ్యేయంగా కో–ఆపరేటివ్ మోడల్లో ఈ ట్యాక్సీ సర్వీస్ కంపెనీ మొదలైంది. రాబోయే రెండేళ్లలో దీనిని 500 నగరాలకు విస్తరించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్, గుజరాత్, ముంబై వంటి ప్రాంతాలలో 6.37 లక్షల మంది డ్రైవర్లు, 35.77 లక్షల మంది కస్టమర్లతో ఇది విజయవంతంగా నడుస్తోంది. త్వరలోనే కోల్కతా, నాగ్పూర్, భోపాల్, పట్నా వంటి నగరాల్లో అందుబాటులోకి రానుంది.
ఇతర ప్రాజెక్టులు
దేశంలో విత్తనాల ఉత్పత్తిని పెంచేందుకు భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ను (బీబీఎస్ఎస్ఎల్) బలోపేతం చేస్తున్నారు. దీనికోసం ఐసీఏఆర్తో ఒప్పందం కుదిరింది. యూపీ, మహారాష్ట్రల్లో టిష్యూ కల్చర్ ల్యాబ్స్, దేశవ్యాప్తంగా 85 కొత్త గోదాములను ప్రారంభించడంతో పాటు 47 ధాన్య నిల్వ కేంద్రాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.2047 నాటికి 'వికసిత్ భారత్' సాధనలో కో–ఆపరేటివ్ రంగం అత్యంత బలమైన పునాదిగా మారుతుందన్నారు.
