టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్రకు జనం పోటెత్తారు. సోమవారం టెహ్రాన్లో అంతిమ యాత్ర ప్రారంభం కాగా, లక్షలాది మంది ప్రజలు ఖమేనీకి వీడ్కోలు పలికేందుకు వచ్చారు. టెహ్రాన్లోని అజాదీ చౌక్ నుంచి కిలోమీటర్ల మేర వీధులన్నీ జనంతో నిండిపోయాయి. ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల శవపేటికలపై ఇరాన్ జాతీయ జెండాలు ఉంచి ట్రక్కుపై ఊరేగించారు. ట్రక్కుపై ఉన్న శవపేటికలను తాకడానికి జనం ఎగబడ్డారు.
2020లో జరిగిన రివల్యూషనరీ గార్డ్ జనరల్ ఖాసీం సులేమానీ అంతిమయాత్ర (10 లక్షల మందికి పైగా) కంటే ఖమేనీ అంతిమ యాత్రకు వచ్చిన జనం చాలా ఎక్కువ అని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఫైర్ ఇంజన్ల ద్వారా జనంపై నీటి తుంపరలను చల్లారు. తొక్కిసలాట జరగకుండా అధికారులు మైకుల ద్వారా ప్రజలను నెమ్మదిగా నడవాలని సూచించారు. ఈ అంతిమయాత్ర టెహ్రాన్ వీధుల గుండా మెహరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 12 గంటల పాటు సాగుతుందని రివల్యూషనరీ గార్డ్ జనరల్ హసన్ హసంజాదే తెలిపారు.
శనివారం ప్రారంభమైన ఈ సంతాప దినాలు గురువారంతో ముగుస్తాయి. ఖమేనీ జన్మస్థలమైన మషద్లోని ఇమామ్ రెజా వద్ద ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. వారిని ఉరితీయాలంటూ ప్లకార్డులు పట్టుకొని డిమాండ్ చేశారు. ట్రంప్ దిష్టిబొమ్మను ఉరితీశారు.
