తమిళనాడును వణికిస్తున్న కోయంబేడు మార్కెట్

తమిళనాడును వణికిస్తున్న కోయంబేడు మార్కెట్

ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరు పొందిన కోయంబేడు మార్కెట్ తమిళనాడును ప్రమాదంలో పడేసింది. ఢిల్లీ మర్కజ్ ద్వారా వచ్చిన కరోనా వ్యాప్తిని తమిళనాడు ప్రభుత్వం అడ్డుకోగలిగినా.. కొత్తగా కోయంబేడు ఉపద్రవాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. కొత్తగా వచ్చిన కోయంబేడు ఉపద్రవం రాష్ట్రాన్ని వణికిస్తోంది. చెన్నైలో ఉన్న కోయంబేడు మార్కెట్‌ వల్ల ఒక్క చెన్నై మాత్రమే కాకుండా.. చుట్టుపక్కల ఉన్న కడలూరు, విల్లుపురం, అరియలూరు సహా పలు జిల్లాలు కరోనా బారిన పడ్డాయి. ఫలితంగా సోమవారం ఒక్కరోజే అత్యధిక స్థాయిలో 527 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో అధికంగా చెన్నైలో 266, కడలూరులో 122, విల్లుపురంలో 49, పెరంబలూరులో 25 కొత్త కేసులు ఉన్నాయి. కొత్త కేసుల్లో చాలా వరకు కోయంబేడు ద్వారా వచ్చినవేనని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. సోమవారం వచ్చిన 527 కొత్త కేసులలో 400 లకు పైగా కేసులు కోయంబేడులో పనిచేసిన కార్మికులు, వారిని కలిసిన వారివే కావడం గమనార్హం. తమిళనాట కరోనా వ్యాప్తి దాదాపుగా అదుపులోనే వుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కోయంబేడు ఉదంతంతో ఒక్కసారిగా సమీకరణలు మారిపోయాయి. ఊహించని స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. కోయంబేడు మార్కెట్‌లో కరోనా కేసులు వెలుగుచూసిన తరువాత పువ్వులు, పండ్ల మార్కెట్‌ను శివారు ప్రాంతం మాధవరానికి మార్చారు. తాజాగా వందల సంఖ్యలో కేసులు బయట పడడంతో మార్కెట్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కార్పొరేషన్‌ అధికారులు ప్రకటించారు. కోయంబేడు మార్కెట్ కు బదులుగా శివారు ప్రాంతమైన తిరుమళిసైలో తాత్కాలికంగా మరో మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. చెన్నైలో సోమవారం అత్యధికంగా 266 కేసులు నమోదు కాగా.. అందులో 3 రోజులు మరియు 10 రోజుల శిశువులు కూడా ఉండడం బాధాకరం. కొత్తగా నమోదయిన కేసుల్లో దాదాపు 18 మంది 10 ఏళ్లలోపు చిన్నారులు ఉండడం గమనార్హం.

For More News..

ఫోన్లలో లోకేషన్ ట్రాకింగ్ బ్యాన్ చేసిన ఆపిల్, గూగుల్