- కొత్త గోల్స్ నిర్ణయించుకున్న సంపన్నులు
- ఆరోగ్యానికి అన్నింటికంటే ఇంపార్టెన్స్
- కెరీర్, పిల్లలకు మరింత డబ్బు కేటాయింపు
- కొత్త ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీల తయారీ
- వెల్లడించిన స్టాండర్డ్ చార్టర్డ్ స్టడీ
న్యూఢిల్లీ: బిచ్చగాడు మొదలుకొని బిలియనీర్ వరకు కరోనా ప్రతి ఒక్కరినీ ఎంతోకొంత కష్టపెట్టింది. నష్టపెట్టింది. అయితే బాగా డబ్బున్నోళ్లు ఈ మహమ్మారితో విలువైన పాఠాలను నేర్చుకున్నారు. రొడ్డకొట్టుడు జీవితాన్ని పక్కనబెట్టి కొత్త మైలురాళ్లను చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. రకరకాల గోల్స్ పెట్టుకున్నారు. కొందరు మొదట్లో జోష్తో ముందుకు వెళ్లిన కాన్ఫిడెన్స్ లేక మధ్యలోనే వదిలేయగా, మిగిలిన వారు పోరాడి సాధించారు. ‘వెల్త్ ఎక్స్పెక్టెన్సీ రిపోర్ట్ 2021’ పేరుతో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ విడుదల చేసిన సర్వే రిపోర్టు ఈ సంగతులను వెల్లడించింది. సర్వే కోసం 15,649 మంది హైనెట్వర్త్ ఇండివిడువల్స్ (హెచ్ఎన్ఐ), సంపన్నుల నుంచి వివరాలు తీసుకుంది. సర్వే రిపోర్టు వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్త బాటలో..
కరోనా కేసులు వెలుగు చూశాక డబ్బున్నోళ్లు కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు. 94 శాతం మంది కొత్త లైఫ్ గోల్స్ను నిర్ణయించుకున్నారు. తమ ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అవుతాయని భయపడ్డామని 48 శాతం మంది చెప్పారు. దీంతో ప్రయారిటీలను మార్చి కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. డబ్బు కంటే ముందు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలని దాదాపు సగం మంది టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక ముందు ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకోవడానికి పొదుపును పెంచుకోవాలని అనుకున్నామని 39 శాతం మంది చెప్పారు. పిల్లలను పెంచడం కోసం, విదేశాలకు వెళ్లడానికి డబ్బును కేటాయించామని అన్నారు. తమ పిల్లలకు మరింత క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందించడానికి మరింత డబ్బును పక్కనపెట్టామని 37 శాతం మంది రెస్పాండెంట్లు వెల్లడించారు.
కరోనా వచ్చాక భవిష్యత్ గురించి బెంగ పెరిగిందని 50 శాతం సంపన్నులు చెప్పారు. తమకూ ఇలాగే అనిపించిందని 41 శాతం మంది హెచ్ఎన్ఐలు అన్నారు. టార్గెట్లను చేరుకున్నారా? అన్న ప్రశ్నకు మెజారిటీ ఇండియన్ రెస్పాండెంట్లు నెగెటివ్గానే జవాబు ఇచ్చారు. ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకుల వల్ల గోల్స్ను చేరుకోలేదని 30 శాతం మంది సంపన్నులు చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ అవకాశాల గురించి తగిన సమాచారం లేకపోవడం వల్ల నష్టపోయామని 28 శాతం మంది, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలను సరిగ్గా మార్చుకోలేక ఇబ్బందిపడ్డామని మరో 28 శాతం మంది అన్నారు. అయితే గ్లోబల్గా చూస్తే మాత్రం పరిస్థితి ఆశాజనకంగా ఉంది. తాము కొత్త ఇన్వెస్ట్మెంట్స్ స్ట్రాటజీలతో చాలా వరకు సక్సెస్ సాధించామని 94 శాతం మంది అన్నారు. షార్ట్ టెర్మ్ ట్రేడింగ్, ప్రైవేటీ ఈక్విటీ, ప్రైవేట్ డెట్ స్ట్రాటజీలతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకున్నామని అన్నారు.
కరోనా ఎఫెక్ట్ గత ఏడాది కాస్త తక్కువగా ఉన్నా ఇండియాలోని రెస్పాండెంట్లలో నిరాశావాదమే కనిపించింది. ఆర్థిక పరిస్థితి గురించి చాలా టెన్షన్ పడ్డారు. ఇలాంటి మానసిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి కౌన్సెలర్ల సాయం తీసుకోవాలి. రిస్క్ను బ్యాలెన్స్ చేస్తూ తెలివైన ఇన్వెస్ట్ స్ట్రాటజీని తయారు చేసుకోవాలి. సామ్రాట్ ఖోస్లా, ఎండీ,హెడ్ ఆఫ్ వెల్త్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్
ఆరోగ్యం, పిల్లల భవిష్యత్ గురించి చాలా మంది బెంగపడ్డారు. ఈ రెండింటి కోసం మరింత డబ్బును పక్కనపెట్టాలని అనుకున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరింత ఇంపార్టెన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే చాలా మంది గోల్స్ నిర్ణయించుకున్నారు కానీ ఆచరణలో చూపలేదు. గ్లోబల్గా చూస్తే మాత్రం పరిస్థితి సానుకూలంగానే ఉంది. నకుల్ జైన్, ఎండీ అఫ్లూయెంట్ క్లెయింట్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్