- హెల్త్ బులిటెన్ లో ఇప్పటిదాకా 996 మంది మరణించినట్టు వెల్లడి
- రోజురోజుకూ పెరుగుతున్నసీరియస్ కేసులు
- ప్రస్తుతం దవాఖాన్లలో7 వేల మంది పేషెంట్లు
హైదరాబాద్, వెలుగు: కరోనా మరణాలు వెయ్యికి చేరువయ్యాయి. వైరస్తో ఇప్పటిదాకా 996 మంది చనిపోయినట్టు బుధవారం ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 459 మంది కేవలం వైరస్ సోకడం వల్లే చనిపోయారని, వీళ్లకు అంతకుముందు ఎలాంటి రోగాలు లేవని తెలిపింది. అప్పటికే ఇతర రోగాలతో బాధపడుతూ, కరోనా సోకడం వల్ల మరో 537 మంది చనిపోయారని చెప్పింది. దేశవ్యాప్తంగా కరోనాతో చనిపోయినోళ్లలో 30 శాతమే నాన్కోమార్బిడ్ వ్యక్తులు ఉండగా, మన దగ్గర మాత్రం ఏకంగా 46.3 శాతం నాన్కోమార్బిడ్ డెత్స్ ఉండటం గమనార్హం. మరోవైపు కరోనా ఎఫెక్ట్తో ఆర్గాన్స్ పాడైపోయి సీరియస్ అవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం 30,400 యాక్టివ్ కేసులు ఉండగా, ఇందులో 22.58 శాతం.. అంటే, 6,866 మంది కరోనా పేషెంట్లు దవాఖాన్లలో ఉన్నారు.
వెంటిలేటర్పై 1,683 ప్రాణాలు
సాధారణంగానే వెంటిలేటర్ దాకా వెళ్లిన పేషెంట్లు తిరిగి కోలుకునేందుకు తక్కువ చాన్స్ ఉంటుంది. కరోనా పేషెంట్ల విషయంలో రికవరీ రేట్ మరింత తక్కువగా ఉంటోంది. పూర్తి వెంటిలేషన్ వరకూ వెళ్లినోళ్లలో కేవలం పది నుంచి 20 శాతం మంది మాత్రమే బతుకుతున్నారని క్రిటికల్ కేర్ విభాగం స్పెషలిస్టులు చెబుతున్నారు. 80 నుంచి 90 శాతం మంది వెంటిలేటర్పైకి వెళ్లిన పది రోజుల్లోనే చనిపోతున్నరని అంటున్నారు. ఇక సోమవారం దాకా ఆక్సిజన్పై 3,199 మంది ఉంటే, మంగళవారం ఈ సంఖ్య 3,444కు పెరిగింది. సోమవారం దాకా వెంటిలేటర్పై 1,514 మంది ఉండగా, మంగళవారం ఈ సంఖ్య 1,683కు పెరిగింది. ఒక్క రోజులోనే 243 మంది ఆక్సిజన్పైకి, 169 మంది వెంటిలేటర్పైకి వెళ్లినట్టు సర్కార్ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. వెంటిలేటర్ వరకూ వెళ్లిన ప్రతి వంద మందిలో 80 మంది చనిపోతున్నారని డాక్టర్లు చెబుతుండగా, రోజూ పది నుంచి 12 మంది మాత్రమే చనిపోతున్నట్టు ఆరోగ్య శాఖ చూపిస్తోంది.
డెత్స్ తక్కువగా చూపుతున్నరు!
కరోనాతో మార్చిలో ఇద్దరు చనిపోతే, ఇప్పుడు రోజుకు కనీసం పది మంది చనిపోతున్నరు. ప్రస్తుతం రాష్ర్టంలో కరోనా డెత్ రేట్ 0.61 శాతం మాత్రమే ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది. మరణాల సంఖ్యను తక్కువగా చేసి చూపించడం వల్లే ఇంత తక్కువ డెత్ రేట్ ఉన్నదని డాక్టర్లు చెబుతున్నారు. వాస్తవానికి మే నెల నుంచే మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపించడం స్టార్ట్ చేశారు. అయితే అప్పుడు రోజుకు ఒకట్రెండు మరణాలను దాస్తే, ఇప్పుడు రోజూ పదుల్లో దాచిపెడుతున్నారు. ఏప్రిల్ చివరి నాటికి రాష్ర్టంలో కరోనా డెత్ రేట్ 4.92 శాతంగా ఉంది. మే నెలలో మరణాలు దాయడంతో డెత్ రేట్ 3.03 శాతానికి తగ్గింది. జూన్ రెండో వారం దాకా రోజూ పది నుంచి 15 మంది మరణిస్తున్నట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. రెండో వారంలో సీఎం కేసీఆర్ రెండుసార్లు ఆరోగ్యశాఖపై రివ్యూ చేశారు. కోమార్బిడ్ డెత్స్ను కరోనా డెత్స్గా చూడడం సరికాదని హెల్త్ ఆఫీసర్లు సీఎం వద్ద అభిప్రాయపడ్డారని సీఎంవో నుంచి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఆ తర్వాత నాలుగైదు రోజుల నుంచి కరోనా డెత్స్ అత్యంత తక్కువ చేసి చూపించడం ప్రారంభించారు. ఇప్పటికీ అదే కొనసాగిస్తూ డెత్ రేట్ 0.61కు తీసుకొచ్చారు. ఒక్క గాంధీ దవాఖానలోనే రోజూ 35 మందికిపైగా చనిపోతుండగా, కేవలం పది మంది మాత్రమే చనిపోతున్నట్టు చూపుతున్నారు. పైగా, డెత్ రేట్ తక్కువగా ఉందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నయి. రాష్ర్టంలో కరోనా మరణాల అసలు లెక్క సర్కార్ లెక్కకు ఐదింతలు ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.