కేసులు పెరుగుతున్నా ట్రైనింగ్‌ ఆపట్లే

కేసులు పెరుగుతున్నా ట్రైనింగ్‌ ఆపట్లే

హైదరాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లాకు చెందిన సురేశ్ పంచాయతీ సెక్రటరీ. పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ ఇస్తున్న ట్రైనింగ్ కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చాడు. మూడ్రోజుల ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లాడు. ఇంటికెళ్లినంక జలుబు, జ్వరం మొదలైంది. కరోనా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. ఒక్క సురేశ్ నే కాదు.. చాలామంది పరిస్థితి ఇట్లనే ఉంది. ట్రైనింగ్ పూర్తి చేసుకొని వెళ్లినొళ్లలో కొంతమందికి కరోనా సోకగా, తమకెక్కడ పాజిటివ్ వస్తదోనని మిగిలినోళ్లు భయపడుతున్నారు. ఓవైపు కేసులు పెరుగుతున్నా, అధికారులు ట్రైనింగ్ మాత్రం ఆపడం లేదని సెక్రటరీలు వాపోతున్నారు. ట్రైనింగ్ రాకపోతే అధికారులు షోకాజ్ నోటీసులు ఇస్తారనే భయంతోనే రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఆగస్టు వరకు ట్రైనింగ్... 
రాష్ర్టంలో పని చేస్తున్న దాదాపు 8,500 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు రాజేంద్రనగర్ లోని తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ (టీఎస్ఐఆర్ డీ)లో పంచాయతీరాజ్ శాఖ ట్రైనింగ్ ఇస్తోంది. గ్రామ పంచాయతీ అధికారాలు, విధులు, పీఆర్ యాక్ట్ , ఇంటి పన్ను, హరితహారం, డంపింగ్ యార్డులు తదితర అంశాలపై శిక్షణ ఇప్పిస్తోంది. పోయినేడాది ఆగస్టున ట్రైనింగ్ ప్రారంభమైంది. బ్యాచ్ కి 50 మంది చొప్పున ఒకేసారి రెండు బ్యాచ్ లకు మూడ్రోజుల పాటు ట్రైనింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు 3,500 మందికి ట్రైనింగ్ పూర్తి కాగా, ఆగస్టు వరకు అందరికీ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్నా, ట్రైనింగ్ కి వచ్చి వెళ్తునొళ్లలో చాలామంది కరోనా బారిన పడుతున్నా అధికారులు క్లాసులు ఆపడం లేదని సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి రావడం, ఒకే దగ్గర 100 మంది కలవడం, మూడ్రోజుల పాటు కలిసి ఉండడం, ఊళ్ల నుంచి సిటీకి రావడంతో వాతావరణం, ఫుడ్, వాటర్ అన్నీ మారడంతో జలుబు, దగ్గు, జ్వరం వస్తోందని వాపోతున్నారు. ఊరికి వెళ్లగానే కరోనా లక్షణాలు బయటపడుతున్నాయని అంటున్నారు. కరోనా తగ్గే వరకు ట్రైనింగ్ ఆపాలని కోరినా, అధికారులు పట్టించుకుంటలేరని ఆవేదన చెందుతున్నారు.

బ్రేక్ ఇస్తే బాగుంటుంది: ట్రైనర్ 
‘‘ట్రైనింగ్ కు రావడానికి సెక్రటరీలు భయపడుతున్నారు. కరోనా సోకుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ టైమ్ లో క్లాసులు చెప్పడం.. మాకు కూడా ఇబ్బందిగానే ఉంది” అని పంచాయతీరాజ్ శాఖకు చెందిన ట్రైనర్ ఒకరు అన్నారు. ట్రైనింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ట్రైనింగ్ ఇస్తున్నం. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నోళ్లనే ట్రైనింగ్ కు పంపాలని అధికారులు ఆదేశాలు ఇచ్చాం. పైఅధికారుల నుంచి ఆదేశాలు వస్తే ట్రైనింగ్ కు బ్రేక్ ఇస్తం” అని ఇన్​స్టిట్యూట్ అధికారి ఒకరు చెప్పారు.