RIP హరీష్ రాణా : 13 ఏళ్ల నరకయాతనకు విముక్తి.. దేశంలోనే తొలి కారుణ్య మరణం..!

RIP హరీష్ రాణా : 13 ఏళ్ల నరకయాతనకు విముక్తి.. దేశంలోనే తొలి కారుణ్య మరణం..!

న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి పొందిన హరీశ్ రాణా (31) మృతి చెందాడు. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా మారిన హరీష్ రాణా ఢిల్లీలోని ఎయిమ్స్‎లో మంగళవారం (మార్చి 24) తుది శ్వాస విడిచాడు. దీంతో 13 ఏళ్ల నరకయాతన నుంచి విముక్తి పొందాడు.  

ఉత్తరప్రదేశ్‎లోని ఘజియాబాద్‎కు చెందిన హరీష్ రాణా (31) చండీగఢ్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో 2013, ఆగస్టు 20 ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదవశాత్తూ హాస్టల్ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడికి తలకు తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లాడు. ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేసిన లాభం లేకుండాపోయింది.

దాదాపు 13 ఏండ్లుగా అతడు కోమాలోనే ఉండి జీవచ్ఛవంలా మారిపోయాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా.. ఎంత మంది వైద్యులు చూసినా అతడిని సాధారణ  స్థితికి తీసుకురాలేకపోయారు. ఇక అతడు కోలుకోవడం కష్టమేనని వైద్యులు కూడా తేల్చి చెప్పారు. దీంతో జీవచ్చవంలా మారిన తన కుమారుడి నరకయాతన చూడలేక హరీష్ రాణాకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని అతని పేరేంట్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 

►ALSO READ | ఏం మనిషివి రా నువ్వు.. కాళ్లతో తొక్కిన ఆలూతో.. టిక్కీ చేసి అమ్ముతున్నాడు..!

కానీ ఇందుకు ఢిల్లీ హైకోర్టు ఒప్పుకోలేదు. దీంతో రాణా తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన దేశ సర్వోన్నత న్యాయస్థానం మెడికల్ రిపోర్ట్స్, బాధితుడి తల్లిదండ్రుల మనోవేదనను పరిగణలోకి తీసుకుని రాణా కారుణ్య మరణానికి అనుమతి ఇస్తూ 2026, మార్చి 11న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. సుప్రీం ఆదేశాల మేరకు హరీష్ రాణాను ఢిల్లీ ఎయిమ్స్‎కు తరలించి లైఫ్ సపోర్ట్ తొలగించడంతో మార్చి 24న అతడు కన్నుమూశాడు.