కరోనా సోకితే వారం స్పెషల్​ లీవ్స్

కరోనా సోకితే వారం స్పెషల్​ లీవ్స్
  • సింగరేణి ఏరియా జీఎంలతో  డైరెక్టర్ల సమీక్ష

హైదరాబాద్‌, వెలుగు : కరోనా సోకిన సింగరేణి ఎంప్లాయీస్​, సిబ్బందికి సర్కారు రూల్స్​ ప్రకారం వారం రోజుల స్పెషల్ ​లీవ్స్​ఇస్తున్నట్టు సింగరేణి  డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, ఎన్.బలరామ్ తెలియజేశారు. హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి సోమవారం అన్ని ఏరియాల జీఎంలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వచ్చిన వారు ఏడు రోజుల ఐసోలేషన్ తర్వాత డైరెక్ట్​ డ్యూటీకి రావొచ్చన్నారు. దీనికోసం ఎలాంటి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు 913 యాక్టివ్ కేసులు ఉన్నాయని, అందులో 382 మంది ఉద్యోగులు, 415 మంది  వారి కుటుంబ సభ్యులు, 116 మంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారన్నారు.  కరోనా పేషెంట్ల కోసం దవాఖానాల్లో అన్ని బెడ్లను రెడీ చేయాలని ఆదేశించారు.  జీఎం జి.సురేందర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బాలకోటయ్య, కొత్తగూడెం నుంచి జీఎంలు కె.బసవయ్య, ఎ.ఆనందరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ మంథా శ్రీనివాస్ పాల్గొన్నారు.