- పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బి.1.1.529 కేసులు
- బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్లో నమోదు.. సౌతాఫ్రికాపై ట్రావెల్ బ్యాన్
- బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం, ఇటsouలీ, చెక్ రిపబ్లిక్ నిషేధం
- రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం.. టెస్టింగ్, ట్రేసింగ్ను పెంచాలని సూచన
- డబ్ల్యూహెచ్వో చెప్పకుండానే బ్యానేంటని సౌతాఫ్రికా మండిపాటు
- ఇప్పటికిప్పుడు బ్యాన్ వద్దన్న డబ్ల్యూహెచ్వో అధికారి
లండన్: ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ‘బి.1.1529’ బుగులు మొదలైంది. కొత్త వేరియంట్ ఖండాలను దాటేసి.. మరో మూడు దేశాలకూ పాకింది. వ్యాక్సిన్ వేసుకున్నోళ్లకూ వైరస్ అంటుతుండడంతో కొన్ని దేశాలు ఆంక్షల బాట పట్టేశాయి. చాలా దేశాల్లో ఇప్పటికే కేసులు పెరుగుతుండడం.. దానికి కొత్త వేరియంట్ అగ్గి రాజేస్తుండడంతో అలర్ట్ అయ్యాయి. బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చెక్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, సింగపూర్లు సదరన్ ఆఫ్రికా దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించాయి. ఎయిర్ట్రావెల్కు ఎమర్జెన్సీ బ్రేకులేయాలని యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాండర్ లీయన్ చెప్పారు. 24 దేశాలు ఈయూ చీఫ్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయి. డబ్ల్యూహెచ్వో ప్రకటనను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రకటించింది. ప్రస్తుతానికి మన దేశం ఎలాంటి ఆంక్షలు పెట్టకపోయినా.. ఆ దేశాల నుంచి వచ్చే వారిపై గట్టి నిఘా పెట్టాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. టెస్టింగ్, ట్రేసింగ్పై దృష్టి పెట్టాలని, కొత్త వేరియంట్జీనోమ్పై ఇన్సాకాగ్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలని సూచించింది. అయితే, వచ్చే నెల రెండో వారం నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. వివిధ దేశాల్లోని పరిస్థితిని బట్టి నిర్ణయంలో మార్పులు చేస్తామని తెలిపింది. కొత్త వేరియంట్ భయాలు ప్రపంచంలోని అన్ని స్టాక్మార్కెట్లపైనా పడింది. మన బీఎస్ఈ, ఎన్ఎస్ఈతో పాటు ప్రపంచంలోని ముఖ్యమైన బెంచ్మార్క్ ఇండెక్స్లన్నీ శుక్రవారం నష్టపోయాయి. దక్షిణాఫ్రికాతో పాటు దాని పక్క దేశాల్లో కొత్త వేరియంట్లో దాదాపు 50 మ్యుటేషన్లు జరిగాయని సైంటిస్టులు గుర్తించిన సంగతి తెలిసిందే. కొత్త వేరియంట్పై శనివారం డబ్ల్యూహెచ్వో సమావేశం కానుంది. ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా గుర్తించి.. ‘ఎన్యూ’ అనే పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
బెల్జియం, ఇజ్రాయెల్, హాంకాంగ్లో కేసులు
ఇప్పటికే సౌతాఫ్రికాలో ఆరు, బోట్స్వానాలో 3 చొప్పున కరోనా కొత్త వేరియంట్ కేసులను గుర్తించారు. తాజాగా విదేశీ విమానాలపై నిషేధం విధించిన 24 గంటల్లోపే ఇజ్రాయెల్లో ఫస్ట్ బి.1.1529 వేరియంట్ కేసు నమోదైంది. మలావి నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్కు ఆ వైరస్ సోకినట్టు హెల్త్ అధికారులు ప్రకటించారు. దీంతో పాటు మరో రెండు అనుమానిత కేసులను గుర్తించామని, వారిని అబ్జర్వేషన్లో పెట్టామని చెప్పారు. ఆ ముగ్గురు కూడా ఫుల్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారని తెలిపారు. దేశంలో మళ్లీ ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు రావొచ్చని ఆ దేశ ప్రధాని నఫ్తాలీ బెనెట్ హెచ్చరించారు. కొత్త కేసులను గుర్తించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ఒమెగా డ్రిల్’ పేరిట ట్రేసింగ్ను ముమ్మరం చేసింది. ఇటు హాంకాంగ్లోనూ ఫస్ట్ కేసు నమోదైంది. బెల్జియంలోనూ ఒక కేసు నమోదైంది. ఈజిప్ట్ నుంచి వచ్చిన టూరిస్టుకు కన్ఫర్మ్ అయింది. దేశంలో నైట్పార్టీలు, క్లబ్బులపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది.
ముందు జాగ్రత్తగా..
ఆరు దక్షిణాఫ్రికా దేశాలను బ్రిటన్ రెడ్ లిస్ట్లో పెట్టి ట్రావెల్ బ్యాన్ను విధించింది. దక్షిణాఫ్రికా, బోట్స్వానా, లెసోథో, ఎస్వాటిని, జింబాబ్వే, నమీబియాలపై ఆంక్షలను పెట్టింది. ప్రస్తుతానికి కొత్త వేరియంట్ కేసులు నమోదు కాలేదని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. డెల్టా, డెల్లా ప్లస్తో పోలిస్తే ఇది చాలా పవర్ఫుల్ అని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జెన్సీ హ్యారిస్ చెప్పారు. దీని వ్యాప్తి, వ్యాక్సిన్ను తట్టుకునే శక్తి, తీవ్రతపై రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ప్రపంచంలోని అన్ని వేరియంట్లపైనా తాము రీసెర్చ్ చేస్తున్నామని, ఈ కొత్త వేరియంట్ విషయంలో ముందుజాగ్రత్తలు తీసుకున్నామని బ్రిటన్ ఆరోగ్య మంత్రి సాజిద్ వాజిద్ చెప్పారు. బ్రిటన్ నిషేధించిన దేశాలతో పాటు మొజాంబిక్ నుంచి వచ్చే ప్రయాణికులపైనా బ్యాన్ ఉంటుందని ఇటలీ, జర్మనీ ప్రకటించాయి. ఆ 7దేశాలపై సింగపూర్ ప్రభుత్వం ట్రావెల్ బ్యాన్ను విధించింది. ట్రావెల్ బ్యాన్ విధించడంపై సౌతాఫ్రికా ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత జనాన్ని కాపాడుకోవడం కోసం అన్ని దేశాలు తీసుకునే ముందుజాగ్రత్త చర్యలను తాము గౌరవిస్తామని, అయితే, డబ్ల్యూహెచ్వో ఇంకా ఏదీ తేల్చకుండానే నిర్ణయం తీసేసుకోవడం దారుణమని సౌతాఫ్రికా విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేసింది.
మార్కెట్లు కొలాప్స్
కొత్త వేరియంట్ భయాలతో ప్రపంచంలోని అన్ని స్టాక్ ఎక్స్చేంజ్ సూచీలు పతనమయ్యాయి. హాంకాంగ్లోని హ్యాంగ్సెంగ్ ఇండెక్స్ 2.7%, జపాన్ నిక్కీ 225.. 2.5% మేర నష్ట పోయాయి. యూరోపియన్ యూనియన్లోని ఎఫ్టీఎస్ఈ100, ఫ్రాన్స్ సీఏసీ 40, జర్మనీ డీఏఎక్స్లు 2.5 నుంచి 3% వరకు నష్టపోయాయి. అమెరికాలోని డౌ800 పాయింట్లు (2.3%) కొలాప్స్ అయింది. ఎస్ అండ్ పీ 500 (ఐఎన్ఎక్స్) 1.8%, నాస్డాక్ ఒక శాతం చొప్పున పతనమయ్యాయి. ట్రావెల్ బ్యాన్ నేపథ్యంలో ఎక్కువగా ఎయిర్లైన్స్ షేర్లు భారీగా నష్టపోయాయి.
డబ్ల్యూహెచ్వో మీటింగ్
కొత్త వేరియంట్ బి.1.1.529పై చర్చించేందుకు శనివారం డబ్ల్యూహెచ్వో సమావేశం కానుంది. దీని గురించి తెలియాలంటే వారం పడుతుందని డబ్ల్యూహెచ్వో అధికారి క్రిస్టియన్ లిండ్మెయర్ అన్నారు. మ్యుటేషన్లపై సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారన్నారు. ఎక్కువ మ్యుటేషన్లు జరిగినట్టు ప్రాథమిక రీసెర్చ్లో తేలిందని, లోతుగా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి కిప్పుడు ట్రావెల్పై ఆంక్షలు విధించడానికి బదులు.. దానిని ఆపేందుకు సైంటిఫిక్ పద్ధతులను పాటిస్తే బాగుంటుందని ఆమె సూచించారు. శనివారం సమావేశం తర్వాత కొత్త వేరియంట్పై తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తామని ఆమె తెలిపారు.