తెలంగాణలో లిక్కర్ షాపుల మూతపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం తొలుత ఈ నెల 22న రాష్ట్రమంతా మార్చి 31 వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ సందర్భంగా వైన్ షాపులు, బార్లు, క్లబ్స్, టూరిజం బార్లు, కల్లు దుకాణాలను కూడా మూసేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ లాక్ డౌన్ ను మళ్లీ దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశారు. దీంతో రాష్ట్రంలోనూ లాక్ డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లిక్కర్ షాపుల మూసివేతను కూడా రెండు వారాల పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఆ శాఖ డైరెక్టర్.
ఇటీవల లిక్కర్ షాపులను కొద్ది గంటల పాటు తెరుస్తారంటూ ఫేక్ ఉత్తర్వులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ఎక్సైజ్ శాఖ అధికారులు.. సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసి.. ఆ తప్పుడు ఉత్తర్వులు క్రియేట్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.