కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదాపడిన 10వ తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 10 నుంచి పరీక్షల నిర్వహణకు నిర్ణయించిన ఆ రాష్ట్రం ఈ ఏడాది పరీక్ష విధానంలో కొత్త మార్పులు చేసింది. సాధారణంగా టెన్త్ పరీక్షల్లో హిందీ తప్ప మిగిలిన సబ్జెక్టుల్లో 50 మార్కుల చొప్పున రెండేసి పేపర్లు ఉండేవి. ఇప్పుడు వాటిని ఒకే పేపర్ కు కుదించి మొత్తం 100 మార్కులకు ఒకేసారి పరీక్ష పెట్టేందుకు ఏపీ విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 11 పేపర్లను 6 పేపర్లకు కుదించింది. దీంతో మొత్తం ఆరు పరీక్షలను జూలై 10 నుంచి 15 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఎగ్జామ్స్ ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. వాస్తవానికి మార్చి నెలలో జరగాల్సిన ఈ పరీక్షలు ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికల కోసం, మరోసారి కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసింది ఏపీ ప్రభుత్వం.
పరీక్షల షెడ్యూల్ ఇదీ..
జూలై 10న – తెలుగు
జూలై 11న – హిందీ
జూలై 12న – ఇంగ్లీష్
జూలై 13న – గణితం
జూలై 14న – సైన్స్
జూలై 15న – సోషల్