- పరిస్థితి సీరియస్ అయ్యేంత వరకు ఆస్పత్రికి వెళ్లిని పేషెంట్లు
- ఆ స్టేజ్ లో మెడిసిన్ ఇచ్చినా ఫలితం ఉండట్లేదు
- ఆక్సిజన్, వెంటిలేటర్ స్టేజ్ వరకు పోతున్న బాధితులు
- కోలుకోవడానికి చాలా టైం పడుతోందంటున్న డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: హాస్పిటళ్లకు రాకుండా ఆలస్యం చేస్తుండడమే కొందరు కరోనా పేషెంట్ల ప్రాణాల మీదకు తెస్తోంది. సర్కారీ లెక్కలు ఎలా ఉన్నా.. రాష్ట్రంలో రోజూ పదుల సంఖ్యలో జనాలు మరణిస్తున్నారు. ఇందులో చాలా వరకు హాస్పిటళ్లకు ఆలస్యంగా వచ్చినవారేనని డాక్టర్లు చెప్తున్నారు. శరీరం లోపల జరిగే డ్యామేజ్ తాలూకు ఎఫెక్ట్ బయటికి కనిపించక కొందరు, ట్రీట్మెంట్ చార్జీల భయంతో మరికొందరు, అదే తగ్గిపోతుందిలే అనే ఉద్దేశంతో మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిన తర్వాతే దవాఖాన్లకు పరుగులు పెడుతున్నారు. అప్పటికే లంగ్స్, ఇతర అవయవాలు డ్యామేజ్ అవుతున్నాయి. ఆ స్టేజ్లో ఎన్ని మందులు ఇచ్చినా కొందరు కోలుకోవడం లేదు. సగం మంది ఆక్సిజన్తో బయటపడితే, సగం మంది వెంటిలేటర్ వరకూ వెళ్తున్నారు. కరోనా పేషెంట్లలో వెంటిలేషన్ వరకూ వెళ్తే కోలుకోవడానికి యాభై శాతం మాత్రమే చాన్స్ ఉందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
బయటకు నార్మల్ గా ఉంటున్నా..
చాలా మంది కరోనా బాధితులు అసింప్టమాటిక్ లేదా మైల్డ్ సింప్టమాటిక్గానే ఉంటున్నారు. 10 నుంచి 20 శాతం మందిలో మాత్రం వైరస్ సోకిన ఒకట్రెండు రోజుల్లో లక్షణాలు మొదలవుతున్నాయి. ఆ తర్వాత టెస్టులు చేయించుకుని జ్వరం, దగ్గు, జలుబుకు ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. వీటితో వారం రోజుల వరకూ నార్మల్గానే ఉంటున్నారు. లోపల వైరస్ పెరిగిపోవడం, లంగ్స్పై ఎటాక్ జరుగుతూనే పోతున్నాయి. తర్వాత కొద్దికొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఇది గమనించి వెంటనే డాక్టర్లను సంప్రదించిన వాళ్లు సేవ్ అవుతున్నారు. కానీ కొందరు ఆక్సిజన్ లెవెల్స్ 85 శాతం కంటే తగ్గిన తర్వాత, ఊపిరాడక ఇబ్బంది పడే స్టేజ్లోనే హాస్పిటళ్లలో చేరుతున్నారు. అప్పటికే లంగ్స్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడడం, సైటోకైన్ స్టార్మ్తో ఇతర అవయవాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. మెడిసిన్ ఇచ్చినా ఉపయోగం ఉండట్లేదు. ఈ స్టేజ్లో మెడిసిన్కు రెస్పాండ్ అవడానికి కనీసం 4 నుంచి 10 రోజులు టైమ్ పడుతోందని డాక్టర్లు చెబుతున్నారు.
అడ్మిట్ చేసుకుంటలేరు
కరోనా లక్షణాలు, దాని ఎఫెక్ట్పై ఇప్పటికీ కొందరు డాక్టర్లకు పూర్తిస్థాయిలో అవగాహన ఉంటలేదు. లంగ్స్లో ఇన్ఫెక్షన్తో వచ్చినోళ్లకు కూడా ట్యాబ్లెట్స్ ఇచ్చి హోమ్ ఐసోలేషన్కు పంపుతున్నారు. నాలుగైదు రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ పెరిగి, పేషెంట్ కండీషన్ సీరియస్ అవుతోంది. హైదరాబాద్తో పాటు, జిల్లాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. పరిస్థితి సీరియస్ అయిన వెంటనే పేషెంట్ను హైదరాబాద్కు రిఫర్ చేస్తున్నారు. కరోనా పేషెంట్ల విషయంలో రాష్ట్రమంతా ఒకటే ప్రోటోకాల్ పాటిస్తున్నామని సర్కార్ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోందని టెర్షియరీ కేర్ హాస్పిటళ్లలో పనిచేస్తున్న డాక్టర్లు చెబుతున్నారు. గాంధీకి వచ్చే పేషెంట్లు సీరియస్ కండిషన్లో వస్తున్నారని అక్కడి ఓ డాక్టర్ వెల్లడించారు. ఇందులో చాలా మంది ప్రైమరీ స్టేజ్లో సరైన మెడిసిన్ ఇస్తే, కోలుకునేవారేనని చెబుతున్నారు. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ లక్షణాలుంటే జాగ్రత్త
కరోనా బాధితుల్లో జ్వరం, దగ్గు కామన్గా ఉండే లక్షణాలు. చాలా వరకూ ట్యాబ్లెట్స్ వాడటం మొదలు పెట్టిన నాలుగైదు రోజుల్లో పూర్తిగా తగ్గిపోతున్నాయి. తర్వాత కూడా తగ్గకపోతే డాక్టర్లను సంప్రదించడం మంచిది. సీటీ స్కాన్, కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లతో ప్రమాదాన్ని ముందే కనిపెట్టొచ్చు. ఫీవర్ కంట్రోల్ కాకపోవడం, దగ్గు కంటిన్యూగా రావడం, ఆయాసం, కడుపు నొప్పి, దగ్గినప్పుడు తెమడ, రక్తం పడడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కొందరిలో ట్యాబ్లెట్లు వేసుకున్నాక జ్వరం తగ్గినా తర్వాత మళ్లీ వస్తోంది. అలాగే నార్మల్గా ఉన్నప్పుడు దమ్ము రాకపోయినా, కొంత దూరం నడిస్తేనే ఆయాసం వస్తోంది. ఈ సింప్టమ్స్ ఉన్నా డాక్టర్ను సంప్రదించాలి. –
భవిష్యత్లో ఇబ్బందులు వస్తాయి
కరోనా పేషెంట్లలో చాలా వరకు లంగ్స్లో ఇన్ఫెక్షన్ ముదిరిన తర్వాతే హాస్పిటళ్లకు వస్తున్నారు. ఈ ఆలస్యం వల్ల ప్లాస్మా, రెమిడెసివిర్, టొసిలిజుమాబ్ వంటి మెడిసిన్ ఇచ్చినా రెస్పాండ్ అవడానికి 4 నుంచి 10 రోజులు పడుతోంది. కొందరు ఆ తర్వాత కూడా రెస్పాండ్ కావడం లేదు. ముఖ్యంగా షుగర్, బీపీ వంటి వాటితో బాధపడుతున్నవాళ్లు వెంటిలేటర్ వరకు వెళ్తున్నారు. అక్కడివరకూ వెళ్తే తిరిగి కోలుకోవడానికి చాన్స్ తక్కువగా ఉంటోంది. ఒకవేళ కోలుకున్నా లాంగ్ టైమ్లో ఇబ్బందులు వచ్చే చాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందే హాస్పిటల్కు రావడం, డాక్టర్లను సంప్రదించడం మంచిది.
– డాక్టర్ కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్ విభాగం ఇన్చార్జ్, నిజామాబాద్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్