ఏపీలో కరోనా కలకలం.. కడప రిమ్స్‎లో పాజిటివ్ కేసు నమోదు..!

ఏపీలో కరోనా కలకలం.. కడప రిమ్స్‎లో పాజిటివ్ కేసు నమోదు..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‎లో కరోనా కలకలం రేపుతోంది. గురువారం (మే 22) వైజాగ్‎లో తొలి కరోనా కేసు నమోదు కాగా.. తాజాగా కడపలోకి కొవిడ్ ఎంట్రీ ఇచ్చింది. శుక్రవారం (మే 23) కడపలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది. తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఓ వ్యక్తి కడప రిమ్స్‌లో చేరాడు. వైద్యులు పరీక్షలు చేయగా.. కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడిని ప్రత్యేకంగా ఐసోలేషన్‎లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

కొవిడ్ వైరస్ సోకిన వ్యక్తిని నంద్యాల జిల్లా వాసిగా గుర్తించారు. అయితే.. కొవిడ్ కేసు నమోదైనట్లు కడప రిమ్స్ వైద్యులు మాత్రం ఇప్పటి వరకు ధృవీకరించలేదు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రజలకు కీలక సూచనలు చేసింది. పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ ధరించాలని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో సామాజిక దూరాన్ని పాటించాలని సూచించింది. 

ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని, కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పింది. ప్రభుత్వ ఆస్పత్రులు, ల్యాబ్‎లలో మాస్కులు, పీపీఈ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులు నిత్యం అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు సహకరించి తమ ఆరోగ్యాన్ని, సమాజ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు కోరుతున్నారు.