
- రెండు రోజుల్లో 12 మందికి పాజిటివ్
- ఎంసీహెచ్లో మరికొందరికి వైరస్ సోకిందనే అనుమానాలు
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు ఒకరిద్దరికి మాత్రమే వైరస్సోకగా, ఇప్పుడు ఈ సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఏడుగురికి, మంగళవారం ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యారోగ్య శాఖ సిబ్బంది తెలిపారు. ఇందులో మెదక్ టౌన్కు చెందిన ఇద్దరు, హవేళీ ఘనపూర్ మండలంలో మరో ఇద్దరు, కొల్చారం మండలానికి చెందిన ఒకరు ఉన్నారు.
కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని మెదక్ డీఎంహెచ్ఓ డాక్టర్ చందూనాయక్ సూచించారు. మెదక్ మాతా, శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లో ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఓ బాలింతకు పాజిటివ్ రాగా, ఈమెకు ప్రత్యేకంగా చికిత్స అందజేస్తున్నట్టు చెప్పారు. అలాగే మరికొందరు బాలింతలు, గర్భిణులకు సైతం కరోనా సోకినట్టు తెలుస్తోంది.