- మధ్యాహ్నం దాటితే.. మరుసటి రోజే!
- కరోనా టెస్ట్ల కోసమొచ్చేవారిని తిప్పి పంపుతున్నరు
- సెంటరల్లో కరోనా టెస్టులు.. వ్యాక్సినేషన్లో సిబ్బంది బిజీ
- తక్కువ మంది ఉండటంతో వారిపైనే పడుతున్న భారం
- అదనంగా స్టాఫ్ కావాలంటూ లెటర్లు రాస్తున్న డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: సిటీలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల (యూపీహెచ్ సీ)లో కరోనా టెస్టులు.. వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా తక్కువ మంది హెల్త్ స్టాఫ్ ఉండగా వారిపైనే పనిభారం పడుతోంది. పని ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం12 దాటిన తర్వాత కరోనా టెస్టులు, ట్రీట్మెంట్కోసం వచ్చేవారిని మరుసటి రోజు రావాలని తిప్పి పంపుతున్నారు. ఉన్న స్టాఫ్తోనే మధ్యలో చిన్నారులకు ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్లను కూడా నిర్వహిస్తున్నారు. స్టాఫ్ కావాలంటూ కొన్ని పీహెచ్ సీ ల డాక్టర్లు ఉన్నతాధికారులకు లెటర్లు రాస్తున్నారు. డాక్టర్లతో పాటు ఉన్న హెల్త్స్టాఫ్ అంతా కొవిడ్ డ్యూటీల్లోనే బిజీగా ఉంటున్నారు. ఇతర అనారోగ్య కారణాలతో పీహెచ్ సీలకు వచ్చే వారికి టైమ్కి ట్రీట్ మెంట్ అందడం లేదు. ఓ పక్క టెస్టులు, మరో పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా ఆ ప్రభావం కరోనా టెస్టుల కోసం వచ్చే వారిపైనా, ఔట్ పేషెంట్లపైనా పడుతుంది.
మూడు గంటలే టెస్టులు..
కరోనా మొదట్లో ఆర్టీపీసీఆర్ టెస్టులను ప్రధాన ఆస్పత్రుల్లోనే చేశారు. అనుమానితుల నుంచి శాంపిల్స్ తీసుకొని రిజల్ట్వచ్చే వరకు క్వారంటైన్సెంటర్లలో ఉంచి నెగటివ్వస్తే ఇంటికి పంపే వారు. యాంటిజెన్ టెస్టులు అందుబాటులోకి వచ్చాక అన్ని పీహెచ్ సీ ల్లో చేస్తున్నారు. మొదట్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చేసేవారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే చేస్తున్నారు. కొన్నిసెంటర్లలోనై తే మూడు, మూడున్నర గంటలు మాత్రమే టెస్ట్లు చేస్తున్నారు. దీంతో మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ఎవరైనా వస్తే మరుసటి రోజు రావాలని స్టాఫ్ తిప్పి పంపుతున్నారు.
టెస్టులు తగ్గుతున్నయ్..
సిటీలో ప్రస్తుతం అన్ని పీహెచ్సెంటర్లలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ప్రక్రియ కూడా 61 సెంటర్లలో కొనసాగుతోంది. అయితే రోజురోజుకు వ్యాక్సినేషన్ సెంటర్లు పెరుగుతుంటే , కరోనా టెస్టులు మాత్రం తగ్గుతున్నాయి. వ్యాక్సిన్ వేయక ముందు100 టెస్టులు చేస్తే, వ్యాక్సిన్ షురూ అయ్యాక 60 మందికి మాత్రమే చేస్తున్నారు. టెస్టులను చేశాక రిపోర్ట్ను ఆన్లైన్లో ఎంటర్ చేసేందుకే టైమ్పడుతుంది. ఒక్కో సెంటర్లో ఇద్దరు స్టాఫ్ మాత్రమే టెస్టులు నిర్వహిస్తుండగా టైమ్ సరిపోవడం లేదని చెబుతున్నారు. ఇంతకు ముందు అన్ని సెంటర్లలో డైలీ 10 వేల టెస్టులు చేస్తే, ప్రస్తుతం 6 వేలు చేస్తున్నారు.
సాధారణ రోగులొస్తే..
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 89 యూపీహెచ్ సీలు ఉన్నాయి. ఇందులో 9 సెంటర్లు రోజంతా ఓపెన్ చేసి ఉంటాయి. ప్రస్తుతం ఒక మెడికల్ఆఫీసర్, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్టెక్నీషియన్, ఒక ఫార్మసిస్ట్, 5 మంది ఏఎన్ఎంలు,16 మంది ఆశవర్కర్ల చొప్పున ఉన్నారు. మరో 20 పీహెచ్ సీల్లో ఫార్మసిస్ట్ పోస్టులు ఖాళీగా ఉండగా, అక్కడ పేషెంట్లకు మెడిసిన్ఇతర సిబ్బంది ఇస్తున్నారు. వ్యాక్సినేషన్వేయించుకున్నవారు సెంటర్లలో మెడికల్ఆఫీసర్ల అబ్జర్వేషన్లో ఉండాలి. ఒక మెడికల్ఆఫీసర్ కి అదే పని సరిపోతుంది. ఇక స్టాఫ్ నర్స్లు వ్యాక్సిన్రిజిస్ర్టేషన్ కే సరిపోతున్నారు. టీకా ఇవ్వడానికి మరో ఇద్దరు కావాల్సి వస్తుంది. కరోనా టెస్టులైతే ఏఎన్ఎం, ఆశవర్కర్ల సాయంతో ల్యాబ్ టెక్నిషీయన్లు చేస్తున్నారు. ఇలా అందరూ కరోనా బిజీలోనే ఉన్నారు. సాధారణ రోగులొస్తే ట్రీట్ మెంట్ అందని పరిస్థితి నెలకొంది.
అదనపు సిబ్బంది కావాలంటూ..
పీహెచ్ సీ సెంటర్లలో తక్కువ మంది సిబ్బంది ఉండగా పని భారం పెరిగింది. దీనికితోడు ఉన్న వారిలో కూడా కొందరు స్టాఫ్ సిక్లీవ్స్, మరి కొందరు మెటర్నటీ లీవ్స్లో ఉన్నారు. ఉన్నకొం దరి లో కూడా లీవ్స్లో వెళ్లడంతో చాలా సెంటర్ల లో కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్, ఇమ్యూనైజేషన్, ఓపీ పేషెంట్లకు సేవలు అందించడం కష్టంగా మారింది. దీంతో తమ సెంటర్ కి స్టాఫ్ కావాలం టూ మెడికల్ ఆఫీసర్లు ఉన్నతాధికారులకు లెటర్లు రాస్తున్నారు.
ఖాళీలను భర్తీ చేస్తం
పీహెచ్ సీల్లో స్టాఫ్ కొరత లేకుండా చూస్తం. త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తం. ఇప్పటికే వచ్చిన అప్లికేషన్ల అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తం. అన్నిచోట్ల ఉన్న స్టాఫ్ చాలా బాగా పని చేస్తున్నారు. టెస్టులు, వ్యాక్సినేషన్లో స్పీడ్ పెంచాం. ఇంకొద్ది రోజుల్లో అన్ని సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తాం.
‑ డాక్టర్ వెంకటి, డీఎంహెచ్ వో, హైదరాబాద్ జిల్లా