
నల్గొండ: మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్సై తో పాటు…మొత్తం 11 మంది కి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. విధులు నిర్వహిస్తున్న వీరికి అనుమానం రావడంతో కరోనా స్వాబ్ శాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపగా.. పాజిటివ్ అని తేలిందని ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే ఆరుగురికి పాజిటివ్ రాగా, ఆదివారం శాంపిల్ టెస్ట్ లో మరో 5 మంది సిబ్బంది కి కరోనా పాజిటీవ్ గా తేలింది. దీంతో మిర్యాలగూడ రూరల్ పోలీసు స్టేషన్లో కరోనా బాధితుల సంఖ్య 11కు చేరింది.
ఈనెల 31 వరకు స్వచ్ఛంద లాక్ డౌన్
మిర్యాలగూడ మున్సిపాలిటీతోపాటు.. పరిసర ప్రాంతాల్లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపద్యంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించాలని తీర్మానించారు. హోటల్స్, బేకరీలు, జనరల్ స్టోర్స్, బుక్ స్టాల్స్, ఫెర్టిలైజర్ దుకాణాలు, టైలరింగ్, రెడిమేడ్ అసోసియేషన్, పాన్ షాపులు, గోల్డ్, స్టీల్ ఇతర వ్యాపార వర్గాలు ఇవాళ్టి నుండి ఈనెల 31 వరకు స్వచ్చంద లాక్డౌన్ ను పాటించాలని తీర్మానం చేశాయి. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయా వ్యాపార అసోసియేషన్లతో డీఎస్పీ వై.వెంకటేశ్వరరావుతో కలిసి చేపట్టిన సమీక్షలో మున్సిపల్ ఛైర్మన్ తిరునగర్ భార్గవ్ స్వచ్చంద లాక్డౌన్ వివరాలు వెల్లడించారు.