
యునైటెడ్ నేషన్స్: కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) ప్రపంచంలోనే అతిపెద్ద ఆపరేషన్ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కరోనా వ్యాక్సిన్ లు అందుబాటులోకి రాగానే.. 92 పేద దేశాలకు వాటిని అందించేందుకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించనున్నట్లు యునిసెఫ్ ట్విట్టర్ లో ప్రకటించింది. అన్ని దేశాలకూ సురక్షితమైన కరోనా వ్యాక్సిన్ లు త్వరగా అందేలా పని చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో), గవీ సంస్థలు ఏర్పాటు చేసిన కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సిన్స్ ఫెసిలిటీ, రివాల్వింగ్ ఫండ్ ఆఫ్ పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ లతో కలిసి.. వ్యాక్సిన్ ల కొనుగోలు, సప్లైకి నాయకత్వం వహించనున్నట్లు యునిసెఫ్ తెలిపింది. యునిసెఫ్ ఏటా 200 కోట్ల డోసుల వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తూ.. దాదాపు 100 దేశాలకు వాటిని అందిస్తోంది. అనేక ఏళ్లుగా వ్యాక్సిన్ ల కొనుగోలు, సప్లై విషయంలో తమకు ఎంతో నెట్ వర్క్ ఏర్పడిందని, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లను అన్ని దేశాలకు అందేలా చూసేందుకు ఈ నెట్ వర్క్ బాగా ఉపయోగపడుతుందని యునిసెఫ్ పేర్కొంది.