మ‌రో 15 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్

మ‌రో 15 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్

ఢిల్లీలో 15 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. ఆదివారం జ‌రిగిన టెస్టుల్లో పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. సీఆర్పీఎఫ్ 31వ‌ బెటాలియ‌న్ కు చెందిన వీరంద‌రినీ మండావ‌లీలోని ఆస్ప‌త్రిలో ఐసోలేష‌న్ వార్డుకు త‌ర‌లించి చికిత్స అందిస్తున్న‌ట్లు చెప్పారు. గ‌త‌వారం బెటాలియ‌న్ ను సంద‌ర్శించిన ఓ హెడ్ కానిస్టేబుల్ కు క‌రోనా సోక‌డంతో అక్క‌డున్న వారంద‌రికీ టెస్టులు చేశారు వైద్యులు. జ‌మ్ము క‌శ్మీర్ లోని కుప్వారా లోని 162వ బెటాలియ‌న్ లో న‌ర్సింగ్ అసిస్టెంట్ గా ప‌ని చేస్తున్న ఆ హెడ్ కానిస్టేబుల్ సెల‌వుపై నోయిడా వ‌చ్చారు. అయితే లాక్ డౌన్ కార‌ణంగా అత‌డిని 31వ బెటాలియ‌న్ లో రిపోర్ట్ చేయాల‌ని సూచించారు ఉన్న‌తాధికారులు. అక్క‌డ డ్యూటీలో చేరిన త‌ర్వాత ఏప్రిల్ 21న అత‌డికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో టెస్టులు చేయ‌గా.. పాజిటివ్ వ‌చ్చింది.

మొత్తం 24 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు వైర‌స్

గురువారం నాడు ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ 31వ బెటాలియ‌న్ లో 9 మంది జ‌వాన్లు క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో కొత్త కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీలో మొత్తం 24 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు వైర‌స్ సోకింది. అయితే ఇంకా సుమారు మ‌రో 15 మందికి పైగా టెస్టు రిపోర్టులు రావాల్సి ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.