గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన టీజేఎస్ అధ్యక్షులు కోదండారం,ఆమీర్ అలీఖాన్ లు ప్రమాణస్వీకారం చేసేందుకు ఇవాళ శాసన మండలికి వెళ్లారు. అయితే మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో వాళ్లిద్దరు కౌన్సిల్ హాల్ లో నే ఎదురుచూస్తున్నారు. చాలా సేపటి నుంచి ఎదురుచూస్తున్నారు. అయితే మాజీ సీఎం కేసీఆర్ ఒత్తిడి మేరకే ప్రమాణం చేయించేందుకు ఛైర్మన్ ఆలస్యం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
జనవరి 26 నుంచి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి త్రోట్ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఇవాళ యశోద హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు ఆయనకు సూచించారు. తను హాస్పిటల్ లో ఉన్నట్లు అసెంబ్లీ సెక్రటరీకి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అయితే కొత్త ఎమ్మెల్సీలు తమ ప్రమాణ స్వీకారం గురించి చెప్పలేదని మండలి ఛైర్మన్ కార్యాలయం వెల్లడించింది.
ఇటీవల శాసనమండలిలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం,ఆమీర్ అలీఖాన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ కూడా మండలి సిఫార్సును ఆమోదించింది. వీరిద్దరితో మండలిలో ఎమ్మెల్సీల సంఖ్య 38కి చేరింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం, వరంగల్ -ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.