
బషీర్బాగ్, వెలుగు: ఇంజినీరింగ్ సీట్ల కౌన్సెలింగ్ లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని తెలంగాణ బీసీ స్టూడెంట్ యూనియన్ డిమాండ్ చేసింది. గర్ల్స్ కోటా సీట్లను బాయ్స్ కు ఎలా కేటాయిస్తారని ఆ సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ప్రశ్నించారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులతో కలిసి మాట్లాడారు. కన్వీనర్ కోటాలో ఓపెన్ గర్ల్స్ కోటా కింద కేటాయించాల్సిన సీట్లను అబ్బాయిలకు కేటాయించడం విద్యామండలి అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. దీంతో వేలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల స్టూడెంట్స్కు నష్టం జరుగుతోందన్నారు. ఫీజు బకాయిలు ఉండడం వల్ల కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, వెంటనే రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు.