కుటుంబీకుల వేధింపులతో భార్యాభర్తల ఆత్మహత్య
అనాథలైన ఇద్దరు చిన్నారులు
రామాయంపేట, వెలుగు: కుటుంబీకుల వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి. ధర్మారంలో గురువారం రాత్రి జరిగింది. మృతురాలి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామానికి చెందిన ముస్కుల విజయ్కుమార్రెడ్డి(29) గ్రామంలో వీఆర్ఏగా చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం భిక్కనూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన బోరెడ్డి వెంకటలక్ష్మి, రాజిరెడ్డిల పెద్ద కూతురు రుచిత(25)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన ఆరు నెలల తర్వాత నుంచి అత్త ప్రేమలత, మామ నర్సింహారెడ్డి, ఆడపడుచు రేవతిలు రుచితను వేధించడం మొదలుపెట్టారు. ఇటీవల వారి వేధింపులు మరింత ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన విజయ్, రుచిత ఈ నెల 27న రాత్రి పురుగుల మందు తాగారు. వెంటనే ఇద్దరిని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రుచిత గురువారం రాత్రి చనిపోగా విజయ్ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. రుచిత తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు అత్త, మామ, ఆడపడుచుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. విజయ్, రుచిత దంపతులకు కొడుకు యువన్రెడ్డి(3), కూతురు సాత్విక(1) ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు అనాథలయ్యారు.
For More News..