కాలేయ మార్పిడి ఆపరేషన్ తర్వాత పుణెలో భార్యాభర్తలు మృతి

కాలేయ మార్పిడి ఆపరేషన్ తర్వాత పుణెలో భార్యాభర్తలు మృతి
  • భర్తకు లివర్ డొనేట్ చేసిన భార్యకు ఇన్​ఫెక్షన్​..  ఆసుపత్రికి వైద్యశాఖ నోటీసులు

ముంబై: మహారాష్ట్రలోని పుణెలో విషాదకర ఘటన జరిగింది. అనారోగ్యంతో ఉన్న భర్తకు ఓ మహిళ తన కాలేయం(లివర్)లోని కొంత భాగాన్ని డొనేట్ చేసింది. అయితే, లివర్ ట్రాన్స్‌‌ప్లాంట్ సర్జరీ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే ఇద్దరూ ఇన్ఫెక్షన్​తో చనిపోయారు. దాంతో ఇద్దరికీ ట్రీట్మెంట్ అందించిన హాస్పిటల్‌‌కు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ నోటీసు జారీ చేసి, విచారణ చేపట్టింది. బాపు బాలకృష్ణ కొమ్కర్ (49), తన భార్య కామిని(42), కొడుకు(20),  కూతురు(14)తో కలిసి పుణెలోని హడప్సర్ లో నివసిస్తున్నారు. బాపు బాలకృష్ణ కొద్దికాలంగా  కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం సహ్యాద్రి హాస్పిటల్‌‌లో జాయిన్ అయ్యాడు. లివర్ ట్రాన్స్‌‌ప్లాంట్ సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించడంతో కామిని తన కాలేయంలోని కొంత భాగాన్ని భర్తకు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ నెల15న లివర్ ట్రాన్స్‌‌ప్లాంట్ సర్జరీ జరిగింది. అయితే, సర్జరీ పూర్తయిన రెండు రోజులకే బాపు బాలకృష్ణ కార్డియోజెనిక్ షాక్ కారణంగా చనిపోయాడు. కామిని కూడా ఈ నెల 21న తీవ్రమైన ఇన్ఫెక్షన్, 
మల్టీ-ఆర్గాన్ ఫెయిల్యూర్​తో మరణించింది.