తిమ్మాపూర్, వెలుగు: తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన గండికోట సునీత దంపతులు రెండు రోజులుగా పంచాయతీ ఆఫీస్లోనే ఉంటున్నారు. మంగళవారం సర్పంచ్ ఆవుదుర్తి రాంకిషన్ఆధ్వర్యంలో గ్రామసభ జరగగా, వారు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. గ్రామానికి చెందిన సునీత దంపతులకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతో పంచాయతీ పాలకవర్గం రెండో విడతలో మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
రెండురోజుల కింద వచ్చిన రెండో జాబితాలోనూ వారి పేరు లేకపోవడంతో సునీత దంపతులు తమ ముగ్గురు పిల్లలను తీసుకొని వచ్చి పంచాయతీ ఆఫీస్లోనే వండుకొని తింటున్నారు. మంగళవారం జరిగిన గ్రామసభలో ఆందోళనకు దిగగా పాలకవర్గంతో పాటు స్థానిక నాయకులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు.
