లిక్కర్ స్కాం కేసు : విచారణ ఈ నెల 14కు వాయిదా

లిక్కర్ స్కాం కేసు  : విచారణ ఈ నెల 14కు వాయిదా
  • దినేష్ అరోరాను కోర్టులో హాజరుపర్చిన సీబీఐ అధికారులు
  • న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన నిందితుడు దినేష్ అరోరా

న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు దినేష్ అరోరాను సీబీఐ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. అతడిని సాక్షిగా పరిగణించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ అంశం చాలా సున్నితమైంది కాబట్టి మీడియాను కోర్టులోకి అనుమతించొద్దని నిందితుడు దినేష్ అరోరా తరపు న్యాయవాది ఆర్.పి ఠాగూర్ కోర్టును కోరారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని.. అప్రూవర్ గా మారానని సీబీఐ న్యాయమూర్తి ఎం కె నాగ్ పాల్ ముందు నిందితుడు చెప్పారు. విచారణకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని న్యాయమూర్తి ముందు దినేష్ అరోరా వాంగ్మూలం ఇచ్చారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్లు  సీబీఐ  కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. 

పూర్వాపరాలు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటిదాకా ముగ్గురు అరెస్టు అయ్యారు. అయితే కీలక నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్ గా మారాడు. మరో నిందితుడు సమీర్ మహేంద్రు.. అరోరా నిర్వహిస్తున్న రాధా ఇండస్ట్రీస్ బ్యాంక్ ఖాతాకు కోటి రూపాయలు బదిలీ చేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. దినేష్ అరోరా, ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా సహా నిందితులందరిపై ఐపీసీ సెక్షన్ 120 బి, 477 ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు.అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో 2021, 2022లో రూపొందించిన ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. గతేడాది నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఈ విధానంలో భాగంగా ఢిల్లీ నగరాన్ని 32 జోన్‌లుగా విభజించి 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. ఈ విధానాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యతిరేకిస్తూ ఎల్‌జీకి ఫిర్యాదు చేశాయి. అంతేకాకుండా, మద్యం విక్రయదారుల నుంచి దాదాపు రూ.144 కోట్ల బకాయిలను మాఫీ చేయాలన్న ఎక్సైజ్ శాఖ నిర్ణయాన్ని కూడా గవర్నర్ వీకే సక్సేనా తప్పుబట్టారు.